అప్పట్లో సౌత్ ఇండియన్ రికార్డు నరసింహనాయుడు
బాలయ్య సరసన సిమ్రాన్, ప్రీతి జింగ్యానీ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2001 జనవరి 11న విడుదలైంది. చిన్నికృష్ణ అందించిన పవర్ఫుల్ కథకు మెరుగులు దిద్ది, పదునైన సంభాషణలు అందించిన పరుచూరి బ్రదర్స్ కూడా ఈ చిత్ర విజయంలో భాగస్వాములే. అప్పట్లో ఈ చిత్రానికి పోటీగా భారీ అంచనాలతో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి మృగరాజు చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలవడం, వెంకీ కెరీర్లోనే అప్పటిదాకా భారీ బడ్జెట్ చిత్రంగా చెప్పుకున్న దేవీపుత్రుడు కూడా యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకోగలగడం కూడా నరసింహనాయకుడికి కలిసివచ్చిందని చెప్పాలి. మణిశర్మ ఈ చిత్రానికి అందించిన మ్యూజిక్ సినిమాను మరో రేంజ్కు తీసుకెళ్లింది. ఈ చిత్రంలోని సూపర్హిట్ పాటలు ఇప్పటికీ సినీ అభిమానులను అలరిస్తూనే ఉంటాయి. 119 సెంటర్లలో 100 రోజులు ఆడిన ఈ మూవీ అప్పట్లో సౌత్ ఇండియన్ రికార్డు సృష్టించింది. అంతేకాదు.. కేవలం 10 కోట్ల లోపు బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం 30 కోట్ల గ్రాస్ను 20 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించిన తొలి తెలుగు సినిమా కూడా. అందుకే సంక్రాంతి సినిమాల విషయం వస్తే ఇప్పటికీ బాలయ్య నరసింహనాయుడును గుర్తు చేసుకోని సినిమా అభిమానులు ఎవరూ ఉండరు.