అక్షయ్ సినిమాపై కర్ణిసేనా సంస్థ ఫైర్.. వెంటనే అవి మార్చాలంటూ..

Shanmukha
ముంబై: బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్‌ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. అంతేకాకుండా తనదైన నటన, కామెడీ, డైలాగ్స్‌తో అందరినీ అలరిస్తాడు. అయితే ప్రస్తుతం అక్షయ్‌కి టైమ్ అంతగా కలిసి వస్తున్నట్లు కనిపించడం లేదు. అతడు నిర్మించిన దుర్గామతి సినిమా రెండూ ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోయాయి. అయితే ఇప్పుడు అక్షయ్ ప్రధాన పాత్రగా తెరకెక్కుతున్న సినిమా కూడా చిక్కుల్లో ఇరుక్కుంది. ప్రస్తుతం అక్షయ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా పృథ్విరాజ్.


తాజాగా ఈ సినిమా పేరు వివాదాల్లో ఇరుక్కుంది. చక్రవర్తి పృథ్వీరాజ్‌ చౌహాన్‌ జీవిత కథ ఆధారంగా  రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా తన నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ మూవీ టైటిల్‌పై కర్ణి సేనా సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సినిమా పేరును వెంటనే మార్చాలని కర్ణి సేనా యూత్ వింగ్  ప్రెసిడెంట్‌, చిత్ర నిర్మాత సుర్జీత్‌ సింగ్‌ రాథోర్‌ డిమాండ్‌ చేశారు. ఈ సినిమాకు పెడితే చక్రవర్తి పూర్తి పేరు ‘పృథ్విరాజ్ చౌహాన్’ అని పేరును మార్చాలని ఆయన అన్నారు. అలా కాకుండా ఈ విధంగా సగం పేరును పెట్టడం ఆయన ప్రతిష్టకు భంగం కలిగించడమే అని ఆయన చెప్పారు. ఒకవేళ తమ డిమాండ్‌లను తిరస్కరిస్తే గతంలో సంజయ్‌ లీలా భన్సాలీ ‘పద్మావత్‌’ సినిమా ఎదుర్కొన్న పరిణామాలనే మీరు కూడా చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.


అంతేకాకుండా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న అక్షయ్‌ కుమార్‌ను తాము గౌరవిస్తున్నామని, అయితే ఈ చిత్ర నిర్మాత ఆదిత్య ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నామన్నారు. చివరి హిందూ సామ్రాట్‌ యోధుడైన పృథ్వీరాజ్‌ చౌహాన్‌ పూర్తి పేరు మీ మూవీకి పెట్టాలని, అంతేకాకుండా ఇందులో ఆయన గొప్పతనం ప్రతిబింబించాలని, ఒకవేళ అలా లేకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి ఆందోళన చేస్తామని అన్నారు. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: