బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'. ఈ చిత్రంలో మొదటి సారిగా అమితాబచ్చన్, అమీర్ ఖాన్ లు నటిస్తున్నారు. మరో ముఖ్యపాత్రలో కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ ఫిరంగి ముల్లాహ్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. అమీర్ ఖాన్ నటన ఎంతో అద్భుతంగా అలరిస్తుంది..బ్రిటీష్ వారికి తొత్తుగా మారిన ఓ అల్లరి దొంగ చివరికి దేశం కోసం..ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్న వారితో కలుస్తాడా..మోసం చేస్తాడా అన్నది చిత్రం చూస్తే తెలుస్తుంది.
అమితాబ్ బచ్చన్ థగ్స్ నాయకుడు ఖుదాభక్ష్ పాత్రలో కనిపించబోతున్నారు. ఫాతిమా జఫీరాగా, కత్రినా కైఫ్ సురయ్య పాత్రలో కనువిందు చేయనుంది. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని ధూమ్-3 ఫేం విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కించారు. థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ 19వ శతాబ్దం తొలినాళ్లలో భారతదేశంలో తమ దోపిడీలతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి సవాల్ విసిరిన థగ్స్ (దోపిడీదారులు) కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 1839లో వచ్చిన ‘కన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్’ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
తాజాగా చిత్ర మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో రెండు భారీ ఓడల సెట్లని ఎలా రూపొందించామనేది చూపించారు. ఏడాదిపాటు సుమారు వెయ్యి మంది ఎంతో కష్టపడి సెట్లని సిద్దం చేశారని చిత్ర బృందం చెబుతుంది. హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన విదేశీ డిజైనర్లు, ఓడ నిర్మాణ నిపుణుల సహకారంతో ఈ సెట్లను తీర్చిదిద్దారు. తెలుగు, తమిళం, హిందీలో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులకి సరికొత్త అనుభూతి ఇస్తుందని చెబుతున్నారు. ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 8న విడుదల కానుంది.