హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: చెన్నకేశవరెడ్డితో ఈజీ కాదు!

కర్నూలు జిల్లాలో బలమైన నాయకుల్లో చెన్నకేశవ రెడ్డి కూడా ఒకరు. దశాబ్దాల కాలం నుంచి రాజకీయాలు చేస్తున్న చెన్నకేశవరెడ్డికి యెమ్మిగనూరు నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. అసలు యెమ్మిగనూరు మొదటలో టీడీపీ కంచుకోటగా ఉండేది. 1985, 1989, 1994,1999 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరుపున బి‌వి మోహన్ రెడ్డి విజయం సాధిస్తూ వచ్చారు. అలా టీడీపీకి కంచుకోటగా ఉన్న యెమ్మిగనూరుని కాంగ్రెస్ వశమయ్యేలా చేశారు చెన్నకేశవ రెడ్డి.
2004, 2009, 2012 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన చెన్నకేశవ రెడ్డి 2012 ఉపఎన్నికలో వైసీపీ నుంచి గెలిచారు. అయితే 2014 ఎన్నికల్లో బి‌వి మోహన్ రెడ్డి తనయుడు జయనాగేశ్వర్ రెడ్డి  టీడీపీ నుంచి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో చెన్నకేశవ రెడ్డి మరొకసారి వైసీపీ నుంచి విజయం సాధించారు. ఇలా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నకేశవ రెడ్డికి యెమ్మిగనూరుపై మంచి పట్టు ఉంది...నియోజకవర్గ ప్రజలతో ఎప్పుడు టచ్‌లోనే ఉంటారు.
ప్రజల మధ్యలోనే తిరుగుతూ, వారి సమస్యలని పరిష్కరించడం కోసం చెన్నకేశవ రెడ్డి గట్టిగానే కృషి చేస్తున్నారు. అలాగే యెమ్మిగనూరులో నాడు-నేడు ద్వారా పాఠశాలలు అభివృద్ధి చెందాయి. జగనన్న కాలనీల ద్వారా పేదలకు ఇళ్ళు కట్టించే కార్యక్రమం జరుగుతుంది...ఇటు రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాల నిర్మాణాలు జరిగాయి. ప్రభుత్వ పథకాలు సజావుగా అందుతున్నాయి. అలాగే ఇక్కడ రోడ్లని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది...అటు తాగునీటి సమస్యని పరిష్కరించాలి.
అయితే చెన్నకేశవరెడ్డిపై ఎక్కువ విమర్శలు రాలేదు. వివాదాల్లో కూడా లేరు. ప్రతిపక్ష నేతలపై అనవసరంగా నోరు వేసుకుని పడిపోయిన సందర్భాలు లేవు. నియోజకవర్గం వరకు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళుతున్నారు...స్థానిక సంస్థల్లో పార్టీని గెలిపించుకున్నారు. ఇక్కడ టీడీపీ తరుపున పనిచేస్తున్న జయనాగేశ్వర్ రెడ్డి దూకుడుగానే రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ కూడా పట్టు సాధించే దిశగా వెళుతుంది. కానీ బలంగా ఉన్న చెన్నకేశవ రెడ్డికి చెక్ పెట్టడం టీడీపీకి అంత ఈజీ కాదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: