మహర్షి శంఖం

Durga
ఒక ఊరి రేవు నుంచి కొంతమంది వ్యాపారులు దగ్గర్లోని నగరానికి బయలుదేరారు. వాళ్లతో పాటు ఓ మహర్షి కూడా వ్యాపారులు ప్రయాణించే పడవలోకి ఎక్కాడు. పడవ మెల్లగా సాగుతుండగా, వ్యాపారులు పిచ్చాపాటి కబుర్లలో మునిగిపోయారు. ‘వవూజాలహారం వేసుకుని మరీ బయల్దేరారేంటి..? అయినా వజ్రాల హారం వేసుకోకపోతే, నగరంలో పని జరగదా?’ఒక వ్యాపారి చూసి నవ్వుతూ అన్నాడు ఇంకో వ్యాపారితో. ‘నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ఏంటీ? పదివేళ్లకూ ఉంగరాలు పెట్టుకోలేదూ? అయినా, డబ్బున్నప్పుడు దాన్ని ప్రదర్శిస్తేనే కదా.. విలువ, గౌరవం దక్కేది’అంటూ ఘాటుగా బదులిచ్చాడు రెండో వ్యాపారి. ఇంతలో మూడో వ్యాపారి కలగచేసుకుని.. ‘డబ్బులేని వాడు ఎందుకూ కొరగాడని పెద్దలు చెప్పిన సామెత. ఒకప్పుడు నన్ను చులకనగా చూసిన వాళ్లే ఇప్పుడు, నా సంపద చూసి వంగి, వంగి నమస్కారాలు చేస్తున్నారు. ఇదంతా సంపద వల్లనే కదా!’అంటూ చెప్పుకొచ్చాడు. ‘మీరు చెప్పేది ముమ్మాటికీ నిజమే.. అయినా ఈ లోకంలో డబ్బులేనిదే ఏ పని జరుగుతుంది చెప్పండి’మధ్యలో కలగచేసుకుని అన్నాడు మరో వ్యాపారి. అలా అందరి ఆస్తిపాస్తులు, వాటివల్ల దక్కే గౌరవాలు మొదలైన వాటి గురించి మాట్లాడి, మాట్లాడి అలిసిపోయిన ఆ వ్యాపారులకు ఏమీ తోచక మహర్షిని ఆటపట్టించసాగారు. ‘నీ దగ్గర ఏముంది ముసలోడా?’అన్నాడొక వ్యాపారి. ఆ మహర్షి చిన్నగా నవ్వుతూ ‘నా దగ్గరేముంటుంది నాయనలారా.. అంటూ జోలెలోంచి ఓ పెద్ద శంఖం తీసి చూపించి ఇది తప్ప నా దగ్గర ఏమీ లేదు’అన్నాడు. అయినా ఊదితే ఆయాసం తప్పించి, ఆ శంఖానికి ఏమొస్తుందిలే.. అనుకుంటూ వ్యాపారులంతా నవ్వసాగారు. వారికి బదులు చెప్పలేని మహర్షి వాళ్లను చూస్తూ కూర్చున్నాడు. అలా పడవ ప్రయాణం సాగుతుంది.  ఇంతలో వాతావరణంలో మార్పు.. బలమైన ఈదురుగాలులు వచ్చాయి. గాలి దెబ్బకు పడవ కుదేలవడాన్ని గమనించి పడవను నడిపే అతను ‘సాములూ.. అందరూ గట్టిగా అరవండి, ఒడ్డున ఉండే ఎవరైనా వింటే మనకు సాయం చేయవచ్చు. లేకపోతే మనమందరం నదిలో మునిగిపోక తప్పదు’అని చెప్పాడు. దాంతో వ్యాపారులంతా పెద్ద పెట్టున ‘రక్షించండి.. రక్షించండి’అంటూ కేకలు పెట్టసాగారు. అయినా ఈదురుగాలుల రొదకి వ్యాపారుల కేకలేవీ ఒడ్డున ఉండేవారికి వినిపించలేదు. వెంటనే మహర్షి తన జోలెలోని శంఖాన్ని తీసి, పెద్ద శబ్దంతో ఊదసాగాడు. అది విన్న కొంతమంది వేరే పడవల్లో వచ్చి వాళ్లను కాపాడారు. బతుకుజీవుడా అంటూ ఒడ్డుకు చేరుకున్న వ్యాపారులందరూ మహర్షి వద్దకు వచ్చి.. ‘నిన్ను ఆటపట్టిస్తూ, చిన్నబుచ్చుతూ మాట్లాడినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా, మా ప్రాణాలను రక్షించావు. లేకపోతే ఈ పాటికి నీటిలో మునిగిపోయేవాళ్లం’అంటూ డబ్బును చేతిలో పెట్టబోయారు. అప్పుడు మహర్షి నవ్వుతూ ‘నాయనలారా.. డబ్బు మనిషిని ఎల్లప్పుడూ కాపాడలేదని మీరు తెలుసుకుంటే చాలు. నాకు ఈ డబ్బుతో పనిలేదు’అని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ ముందుకెళ్లిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: