కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా డేంజర్స్ మోగిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో వైరస్ మహమ్మారి రెండోదశ పూర్తి చేసుకొని మూడో దశలోకి అడుగుపెడుతోంది. మన దేశంలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఇప్పటికే సెకండ్ వేవ్ పూర్తి కావస్తుండగా థర్డ్ వేవ్ త్వరలోనే వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే థర్డ్ వేవ్ మాత్రం అంతగా ప్రమాదకరంగా ఉండదని కూడా చెబుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ నేపథ్యంలో దేశంలో వ్యాక్సినేషన్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా ఫ్రాన్స్ దేశంలో కరోనా వైరస్ నాలుగో దశ ప్రారంభమైందని ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధి గాబ్రియేల్ ప్రకటించారు. తమ దేశంలో కరోనా మహమ్మారి మెరుపు వేగంతో వ్యాప్తి చెందుతుందని గాబ్రియేల్ ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా ఉదృతి నేపథ్యంలో తమ దేశంలో మరోసారి కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. కఠిన ఆంక్షలలో భాగంగా ఫ్రాన్స్ లో సంస్కృతిక వేదికలు, ఉద్యానవనాలు, సినిమా హాల్లు, స్విమ్మింగ్ పూల్స్ సందర్శించాలని అనుకునే వారు తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేసుకున్నట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించాలని తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఎలాంటి కార్యక్రమాలకు హాజరవ్వాలన్నా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పకుండా సమర్పించాలని పేర్కొన్నారు. కరోనా ఫోర్త్ వేవ్ ఉగ్ర రూపం దాల్చే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని తెలిపారు.
ఆగస్టు ప్రారంభం నుండి బార్లు రెస్టారెంట్ల లోకి ప్రవేశించడానికి.... రైలు ప్రయాణం చేయడానికి హెల్త్ పాస్ లు తప్పక ఉండాలి అన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. రెండు వారాల్లో ఐదు మిలియన్ల వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుతామని గాబ్రియేల్ స్పష్టం చేశారు. ఒకవేళ దేశంలో ఎవరైనా కరోనా నిభంధనలు పాటించకపోతే వారికి జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఫ్రాన్స్ లో మంగళవారం మొత్తం 18000 యాక్టివ్ కేసులు ఉన్నాయి.