దేశంలో ఓ వైపు కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంటే మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. ఇప్టటికే గుజరాత్, కర్నాటక లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా మహరాష్ట్రలో కేసుల సంఖ్య ఏకంగా 2వేలకు చేరింది. అంతే కాకుండా హైదరాబాద్ లోనూ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతన్నట్టు వైద్యాధికారులు గుర్తించారు. ఇక తాజాగా తెలంగాణ లోని నిర్మల్ జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. ఫంగస్ కారణంగా ఒకరు మరణించారు. అంతే కాకుండా మరొ ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ మూడు కేసులు కూడా బైంసా డివిజన్ లోనే నమోదయ్యాయి. చింతల గూడెం కు చెందిన అరవై ఐదేళ్ల తుకారం అనే వ్యక్తి కరోనా బారిన పడటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో మొదట హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకోగా షుగర్ ఎక్కువగా ఉండటంతో బ్లాక్ ఫంగస్ బారిన పడ్డట్టు తెలుస్తుంది. దాంతో ఒక కన్ను పూర్తిగా దెబ్బ తినడంతో అతడిని కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబ్ కు తరలించారు.
కాగా చికిత్స పొందుతూ తుకారం మరణించారు. అంతే కాకుండా బైంసా పట్టణంలోని గణేష్ నగరానికి చెందిన లింగు అనే వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో నిర్మల్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అతడికి కూడా బ్లాక్ పంగస్ లక్షణాలు కనిపించడంతో వైద్యులు హైదరాబాద్ కు తీసుకువెళ్లాలని సూచించారు. దాంతో హైదరాబాద్ తీసుకువెళ్లగా వైద్యులు చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ఇక చేసేది లేక అతడిని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. మరోవైపు కుబీర్ మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి సైతం ఫంగస్ లక్షణాలతో బాధపడుతున్నారు. ఇతనికి తొలుత కోవిడ్ సోకగా చికిత్స అనంతరం కోలుకున్నారు. కాగా ఇప్పుడు మళ్లీ ఆయనకు బ్లాక్ ఫంగస్ ఎటాక్ అయింది. దాంతో అతడిని హైదరబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే బ్లాక్ ఫంగస్ పై జిల్లా అధికారులు మాత్రం నోరుమెదపడం లేదు. కానీ హైదరాబాద్ లో వైద్యులు మాత్రం ఇవి బ్లాక్ ఫంగస్ కేసులేనని నిర్ధారించారు.