సర్కార్ కీలక నిర్ణయం.. ఏకంగా 70 వేల ఉద్యోగాలు..?

MOHAN BABU
తెలంగాణలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. రాష్ట్రంలో తొలి దశలో భర్తీ చేయాలని భావిస్తున్న ఉద్యోగాలకు సంబంధించి ఖాళీల పై ఆర్థికశాఖ ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. అన్ని శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరై గతంలో ఇచ్చిన ఖాళీల పై మరోసారి తుది నిర్ధారణ చేశారు. శాఖల వారీగా భర్తీ చేయాల్సిన పోస్టులకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించి సీఎం కేసీఆర్ కి కూడా సమర్పించారు. ఇక సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ నెల 14న మంత్రివర్గ సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే భేటీలో పలు కీలక అంశాలు, తాజా రాజకీయ పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ వైఖరి చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు, పంటల సాగు పై అవగాహన కల్పించడంపై విస్తృతంగా  చర్చించే అవకాశం కనిపిస్తోంది.

ఉద్యోగాల భర్తీపై ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. నిరుద్యోగ సమస్యపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో దాదాపు 70 వేల జాబ్ లకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు క్యాబినెట్ లో పచ్చజెండా ఊపనున్నారని తెలుస్తోంది. ఎప్పటిలోగా ఉద్యోగాలను భర్తీ చేయాలనేది ఈ భేటీలో చర్చిస్తారు. దాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి పైన కూడా క్యాబినెట్ భేటీలో చర్చించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తరఫున కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాల్సిన అంశాలు, భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వరి కాకుండా లాభసాటి వ్యవసాయం కోసం ఏ ఏ పంటలు వేస్తే బాగుంటుందో చర్చిస్తారు. ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇచ్చేలా తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వాసాలమర్రి, హుజురాబాద్ తో పాటు నాలుగు మండలాల్లో కొన్ని దళిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో దళిత బంధు అమలు చేయాలని నిర్ణయించారు. ఇది కాకుండా 119 నియోజకవర్గాల్లో కనీసం వంద మంది లబ్ధిదారులకు దళిత బంధు సాయం అందించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్ యూనిట్, ఆర్టీసీ టికెట్ చార్జీల పెంపు పైన కూడా నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: