హరియాణా ఫార్ములాతో మహారాష్ట్రపై కన్నేసిన మోదీ?

బీజీపీలో సమరోత్సాహం పెరిగింది. హరియాణాలో హ్యాట్రిక్ విజయంతో కొత్త జోష్ పార్టీలో కనిపిస్తోంది. జమ్మూలో అధికారం దక్కకపోయినా వచ్చిన సీట్లు..  ఓట్లు బీజేపీకి బూస్టర్ గా మారింది.  దీంతో త్వరలో జరుగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు బీజేపీ కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. హరియాణా ఎన్నికల ఫలితాల ప్రభావం మహారాష్ట్ర పైన ఉంటుందని బీజేపీ నేతలు విశ్వసిస్తున్నారు. అక్కడి వ్యూహాలపై ప్రధాని మోదీ కసరత్తులు చేస్తున్నారు.


తాజా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ త్వరలో జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధం అవుతోంది. హరియాణాలో విజయం ఖాయమని.. ఆ ఫలితాలతో వచ్చే రెండు రాష్ట్రాల ఎన్నికలకు సిద్ధం కావాలని ఇండియా కూటమి నేతలు భావించారు.  అయితే ఎగ్జిట్ పోల్స్ కూడా హరియాణాలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని  చెప్పాయి. కానీ వాస్తవ ఫలితాలు మాత్రం ఆ పార్టీకి చేదు అనుభవాన్ని మిగిల్చాయి.


2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత మిత్ర పక్షాల సాయంతో కేంద్రంలో ప్రభుత్వం నడుపుతున్న బీజేపీకి తాజా ఫలితాలు కొంత శక్తినిచ్చాయి. ప్రధానంగా హిందీ బెల్ట్ లో కీలకంగా ఉన్న హరియాణాలో తొలి సారి హ్యాట్రిక్ విజయం సాధించడం బీజేపీ నేతలకు బలాన్ని పెంచింది. హరియాణా మరోసారి విజయంతో బీజేపీ ఖాతాలో 13 వ రాష్ట్రం చేరింది. ఒకవేళ ఇక్కడ కాషాయ పార్టీ గెలవకపోతే రాజకీయ సమీకరణాలు మరో విధంగా ఉండేవి.


మిత్ర పక్షాలుగా ఉన్న జేడీయూ, ఎల్జేజీతో పాటుగా ఇతర పక్షాల నుంచి ఒత్తిడి మొదలయ్యేది. హరియాణాలో గెలుపు, జమ్మూలో సీట్లు మిత్ర పక్షాలతో సైతం బీజేపీతో సర్దుబాటు ధోరణితో వెళ్లేందుకు మార్గం సుమగం  చేశాయి. ఇక ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ పక్కా ప్రణాళికతో వెళ్లనుంది. మహారాష్ట్రలో మూడు పార్టీల కూటమితో తలపడుతోంది. అక్కడి ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత పూర్తిగా తమ మీద ఉండదనే అభిప్రాయంతో ఉంది. ప్రస్తుతం ప్రారంభించిన పనులు కొనసాగాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు రావాలనే నినాదంతో ముందుకు వెళ్తోంది. మహారాష్ట్రలో గెలుపును ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: