బంగ్లాదేశ్‌: అధికారం ఉందని విర్రవీగితే.. ఇలాగే ఉంటుందా?

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కాపలాదారులుగా పనిచేయాలి. ప్రజల భద్రతకు, సంక్షేమానికి, దేశ అభివృద్ధికి పెద్ద పీట వేయాలి.  పోలీసుల బలం, సైన్యం అండ చూసుకొని విర్ర వీగితే పాలకులను దేశం విడిచి పోయేలా చేస్తారు. ప్రజల్లో చెలరేగిన అశాంతిని అంచనా వేయలేక షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. ఆమె కాదు సరిగ్గా రెండేళ్ల క్రితం శ్రీలంక అధ్యక్షుడు మహింద్రా రాజపక్సే కూడా ఇలాంటి పరిస్థితినే చవిచూశారు. ఏకంగా దేశం విడిచి పారిపోయారు. ఆయన దేశం విడిచి వెళ్లిపోయిన సందర్భంలో రాజపక్సే అధికారిక నివాసాన్ని ప్రజలు చుట్టుముట్టారు. అందులోకి ప్రవేశించి వీరంగం సృష్టించారు.

ఇదే సమయంలో బంగ్లాదేశ్ లో కూడా శాంతి భద్రతలు క్షీణించాయి. అల్లరి మూకలు అంతకంతకూ రెచ్చిపోతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు రక్షణ లేకుండా పోతోంది. దీంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏం చేయాలో పాలుపోక పోలీసులు సైతం సైలెంట్ అయిపోయారు. దీంతో అల్లరి మూకలు మరింత రెచ్చిపోతున్నారు.  దోపిడీలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెడుతూ ధ్వంసం చేస్తున్నారు.

ఇదే సమయంలో వ్యాపార సముదాయాలు, సూపర్ మార్కెట్లు, మాల్ లు లోకి చొరబడి దొరికిన వస్తువులను దొరికినట్లే దోచుకుంటున్నారు. వాటిని తమ వాహనాల్లో ఎంచక్కా తరలించుకుపోతున్నారు. ఇంత జరుగుతున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మరికొందరు అల్లరిమూకలు పోలీసులపైకే రాళ్లు రువ్వుతున్నారు.

శ్రీలంక లో ఓ నూతన విధానానికి రాజ పక్సే శ్రీకారం చుట్టారు. అది నచ్చని లంకేయులు ఆయనపై ఎదురుదాడి చేశారు. చివరకు ఆయన దేశం విడిచి పారిపోయారు. మరి ఇప్పుడు శ్రీలంక పరిస్థితులు ఏమైనా మారాయా అంటే అప్పటికన్నా గడ్డు పరిస్థితులు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా అంతే.  ప్రధానిగా హసీనా అద్భుత ప్రగతి సాధించారు. మత హింస లేదు. కానీ ప్రశాంతంగా ఉన్న బంగ్లాదేశ్ లో కొన్ని సంఘ విద్రోహ శక్తులు హింసకు ప్రేరేపించాయి. రిజర్వేషన్లను సాకుగా చూపుతూ వారికి కావాల్సిన  విధ్వంసం చేశారు. రేపటి నుంచి బంగ్లాదేశీయుల బతుకులు మారతాయా. అంటే ప్రస్తుతానికి మించిన దుర్భర పరిస్థితులు అనుభవిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: