మోడీ సర్కారు చేస్తున్న మంచి పని.. ఒక్క పత్రికా రాయదేంటి?

భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన తర్వాత ఓ సంప్రదాయాన్ని పదేళ్లుగా కొనసాగిస్తోంది. సాధారణంగా ఆయా రాష్ట్రాలు కానీ.. గతంలో కేంద్ర ప్రభుత్వాలు కానీ  బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన తర్వాత వాటిపై పార్లమెంట్, అసెంబ్లీలో చర్చించుకుంటారు. ఆ తర్వాత దీనిపై విమర్శలు, నిధులు కేటాయించలేదు.. బడ్జెట్ బాగాలేదు. నిరుత్సాహ పరిచింది. ఆశాజనకంగా లేదు. వంటి పదాలతో సాగిపోయేది.

కానీ ఎన్డీయే హయాంలో ప్రధాని మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేంద్ర మంత్రులే దేశంలోని అన్ని రాష్ట్రాలకు వెళ్తుంటారు. వివిధ నగరాలను ఆయా కేంద్ర మంత్రులు సందర్శిస్తుంటారు. ఆ తర్వాత విద్యావంతులు, వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలతో మాట్లాడతారు. బడ్జెట్ పై వారికున్న సందేహాలను నివృత్తి చేసి.. రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చిందో వివరిస్తారు.

గతంలో వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలోను ఇలానే చేశారు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ లో ఏపీ రాష్ట్రానికి , ముఖ్యంగా రాజధాని అమరావతికి ఇచ్చిన నిధులు గురించి చెప్పడానికి కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ మేరకు విజయవాడలోని వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 2040 లక్ష్యంగా బడ్జెట్ ను కేటాయించామన్నారు. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి 8.2 శాతం ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా  నిర్దేశించామన్నారు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సులభతరం చేయడంతో పాటు ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసే దిశగా బడ్జెట్ లో తగు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. తాజా బడ్జెట్ లో ఏపీకి రూ.50474 కోట్లు కేటాయించామన్నారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు.

ఇంత వరకు బాగానే ఉన్నా కేంద్రం గత పదేళ్లుగా బడ్జెట్ పై సందేహాల నివృత్తితో పాటు కేటాయించిన నిధులన వివరించే కార్యక్రమాన్ని చేపడుతుందని చాలా మందికి తెలియదు. కనీసం వీటిని ఏ పత్రిక హైలెట్ చేయదు. మురుగన్ ఈ ఎజెండాపై నే ఏపీకి వచ్చారు అని కూడా బీజేపీ నేతలకు తప్ప రాష్ట్ర ప్రజలకు తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: