గ్రూప్‌1లో 1: 100.. రేవంత్‌ తప్పులను నిలదీస్తున్న హరీశ్‌రావు?

తెలంగాణ నిరుద్యోగుల సమస్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు రేవంత్ రెడ్డి సర్కారును నిలదీసింది. ఈ మేరకు ఆయన సీఎంకు ఓ లేఖ రాశారు. మొత్తం ఏడు డిమాండ్లతో లేఖ రాసిన హరీష్ రావు.. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళన, ఆవేదన ప్రభుత్వం అర్థం చేసుకొని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూశామని.. కానీ నిరాశే ఎదురైందని అన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా... కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్న హరీశ్ రావు.. భారాస ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగాల ప్రక్రియలో నియమాక పత్రాలు ఇచ్చారన్నారు.
 
మిమ్మల్ని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం రోడ్డున పడి అలమటించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారన్న హరీశ్ రావు.. గ్రూప్ వన్, డీఎస్సీ తదితర ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక ప్రక్రియ కూడా ఉద్యోగార్థులకు చాలా ఇబ్బంది కరంగా మారింది, వారి విజ్ఞప్తిని కనీసం వినే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేకపోవడం శోచనీయమన్నారు. గ్రూప్ వన్ మెయిన్స్ కు 1:100 నిష్పత్తితో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయని..  ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని హరీశ్ రావు వివరించారు.

సీఎల్పీ నేతగా నాడు భట్టివిక్రమార్క ఇదే డిమాండ్ చేశారు... కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు తప్పుకుంటుందో అర్థం కావడం లేదన్న హరీశ్ రావు.. ప్రతిపక్షంలో ఉంటే ఒకమాట ఆధికారంలో ఉంటే వేరొకమాటగా ప్రవర్తించడం ఎందుకని ప్రశ్నించారు. గ్రూప్ 2కు 2000 ఉద్యోగాలు, గ్రూప్ 3 కి 3000 ఉద్యోగాలు కలుపుతామన్న మాటను నిలుపుకోవాలని హరీశ్ రావు సూచించారు. పరీక్షల మధ్య తక్కువ విరామం ఉండడంతో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని అభ్యర్థులు అంటున్నారు, ఆ ఒత్తిడితోనే సంగీత అనే అమ్మాయి ఆత్మహత్య కూడా చేసుకుందన్నారు.

ఉద్యోగ నియామకాల పరీక్షల తేదీల మధ్య ఎక్కువ వ్యవధి  ఉండేలా షెడ్యూల్ సవరించాలని సూచించిన హరీశ్ రావు.. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ హామీకి అనుగుణంగా అడుగులు పడలేదన్నారు. వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు గుర్తించి జాబ్ క్యాలెండర్ ప్రకటించి నోటిఫికేషన్లు జారీ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ అని 11 వేల పోస్టులతోనే ఇచ్చి మోసం చేశారు, ఇచ్చిన మాటకు కట్టుబడాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: