బాబు, జగన్‌: పండుటాకుల ప్రాణాలతో రాజకీయం?

ఏపీలో వాలంటీర్లతో పింఛన్ ఇంటికి పంపకపోవడం అనే సమస్య ఇప్పుడు అత్యంత చర్చనీయాంశం అవుతుంది. కేవలం చంద్రబాబు చేసిన పనివల్లే నేడు ఏపీలో పింఛన్ దారులు ఇబ్బందులు పడుతున్నారని నేడు వారు పడుతున్న బాధ, కారుస్తున్న కన్నీరు ఊరికే పోవని వైసీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. తన వయసు ఉన్న ప్రజల ఇబ్బందులు సైతం చంద్రబాబుకు అర్థం కాకపోవడం దారుణం అంటూ మండిపడుతున్నారు.

వాలంటీర్ల విషయం పక్కన పెడితే.. 1.60 వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని.. వీరి చేత కూడా పింఛన్ ఇప్పించవచ్చని మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటూ టీడీపీ ప్రతి విమర్శలు చేస్తోంది. కేవలం పింఛన్ దారులను ఇబ్బంది పెట్టి ఆ బురదను తమపై చల్లే ప్రయత్నాన్ని మానుకోవాలని.. ఖజానాలో డబ్బులు లేక వైసీపీ డ్రామాలు ఆడుతోందని టీడీపీ నాయకులు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.

దీంతో ఈ వ్యవహారం కోడి ముందా.. గుడ్డు ముందా అన్న చందంగా మారింది. ఈ సమస్యలకు కారణం మీరంటే మీరంటూ ఈ నెపాన్ని ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు. ఈ సంగతి అలా ఉంటే ఈ పెన్షన్  పేరు చెప్పి ఏపీలో ఇప్పుడు శవ రాజకీయాలకు వైసీపీ, టీడీపీలు తెరలేపాయి. మొదటి తారీఖునే పింఛన్ రాకపోవడంతో కొందరు వృద్ధులు పంచాయతీ కార్యాలయాల వద్దకు వెళ్లి స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటనలో కృష్ణా జిల్లా పెనమలూరులో వజ్రమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది.

ఈమెను పరామర్శించేందుకు మంత్రి జోగి రమేశ్, టీడీపీ నేత బోడె ప్రసాద్ లు అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చడం అటుంచి రాజకీయ విమర్శలు మొదలు పెట్టారు. మొత్తానికి చంద్రబాబు ఒకరిని పొట్టన పెట్టుకున్నారు అని జోగి రమేశ్ అనగానే.. వైసీపీ కార్యకర్తలు డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. దీనికి స్థానిక టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో మృతురాలి ఇంటి వద్ద వాతావరణం కాస్తా రాజకీయ రచ్చబండగా మారిపోయింది. దీంతో ఈ శవ రాజకీయాలు అవసరమా అని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: