ఎల్లో మీడియా వల్లే బీజేపీ బాబును ఇబ్బంది పెడుతోందా?
ఎవరికి వారే పట్టు వీడకపోవడంతో.. రోజులు కరుగుతున్నాయి తప్ప. పొత్తు పెట్టుకునేందుకు ఎవరూ మొగ్గు చూపడం లేదు. మరోవైపు టీడీపీ , జనసేన తొలి జాబితాను ప్రకటించేశాయి. బీజేపీ వస్తే సరి.. లేకపోతే పొత్తులు లేనట్లే. నెల క్రితం చంద్రబాబు దిల్లీ వెళ్లి అమిత్ షా తో సమావేశం అయ్యారు. ఆయన ఒక ప్రతిపాదన పెట్టారు. చంద్రబాబు తన ప్రతిపాదన తెలియజేశారు. తిరిగి వచ్చేశారు.
ఆ తర్వాత దాని గురించి మాట్లాడటం మానేశారు. అటు బీజేపీ పెద్దలు సైతం ఈ ప్రస్తావన తీసుకురాలేదు. చంద్రబాబు బృందం దిల్లీ వెళ్లడం కానీ.. బీజేపీ జాతీయ బృందం ఏపీకి రావడం కానీ జరగలేదు. మధ్యలో ఒప్పిస్తానన్న పవన్ కు నిన్నటి వరకు అపాయిట్ మెంట్ లభించలేదు. అన్ని పరిణామాల మధ్య అసలు బీజేపీతో పొత్తు ఉంటుందా.. లేదా అన్న అనుమానం బలంగా పెరిగింది. కానీ నిన్నరాత్రి దీనిపై అమిత్షా, చంద్రబాబు, పవన్ చర్చలు జరిపారు. అవి ఇంకా కొలిక్కి రాలేదు.
బీజేపీకి కోపం రావడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కి నాలుగు ఎంపీ, నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇస్తారంటూ ఎల్లో మీడియా కథనం రాసుకొచ్చింది. పొత్తుల్లో ప్రతిష్టంభనకు ఇదే కారణమైందనే వాదన ఉంది. ప్రస్తుతం బీజేపీ ఇచ్చింది తీసుకునే స్థితిలో లేదు. వారు డిమాండ్లకు ఒప్పుకుంటేనే పొత్తు లేకపోతే లేదు. మరోవైపు పవన్ ను అడ్డుపెట్టుకొని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని దిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నారు. మరోవైపు దిల్లీ వెళ్తే వారి కోరికలను చంద్రబాబు తీర్చాల్సి వస్తుంది. అందుకే బీజేపీ తన వద్దకు రావాలని చంద్రబాబు కోరకుంటున్నారు. అదే సమయంలో బీజేపీ సైతం పట్టు బిగిస్తోంది.