ఉక్రెయిన్పై ఉన్నట్టుండి దాడులు పెంచిన రష్యా?
ఈ రెండేళ్ల ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఎవరు ఏం సాధించారు అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. రూ.లక్షల కోట్ల విలువైన బాంబులు పేలాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ.లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. కొన్ని దేశాల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. చివరకు అటు రష్యా లాభపడలేదు. ఇటు ఉక్రెయిన కు ఉపశమనం కలగలేదు. మరోవైపు ఉక్రెయిన్ కు సాయం అందిస్తున్న యూరప్ దేశాలు సైతం ఆర్థికంగా నష్టపోతూనే ఉన్నాయి. యుద్ధం లోను, కోర్టులలోను గెలిచిన వారు ఇంటికి వెళ్లి ఏడుస్తారు. ఓడిన వ్యక్తి అక్కడే ఏడుస్తారు అని ఓ సామెత ఉంది.
ఇది ఉక్రెయిన్, రష్యా యుద్ధ విషయంలో అక్షరాలా సత్యం అవుతుంది. ప్రస్తుతం ఇరు దేశాల పరిస్థితి అంతే. పైకి ఇరు దేశాలు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఇరు దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఈ నెల 17 తో యుద్ధం ప్రారంభమై రెండేళ్లకు చేరుకుంటుంది. ఇలాంటి తరుణంలో రష్యా ఇరాన్ నుంచి అత్యాధునిక డ్రోన్లను కొనుగోలు చేసింది. వీటిని విరివిగా ఉక్రెయిన్ పై ఉపయోగిస్తోంది.
కొత్తకొత్త ప్రదేశాలను స్వాధీనం చేసుకునేందుకు దాడులను క్రమంగా పెంచింది. అనూహ్య రీతిలో రష్యా తన అమ్ముల పొదిలోని అత్యంత శక్తిమంతమైన క్షిపణిని బయటకు తీసి ప్రయోగించిన విషయాన్ని ఉక్రెయిన్ గుర్తించింది. రష్యా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ఈ పవర్ ఫుల్ అస్త్రం పేరు జిర్కాన్. ప్రపంచంలో మరే దేశానికి కూడా ఈ క్షిపణిని ఢీకొట్టే సత్తా లేకపోవడం దీని ప్రత్యేకత. జిర్కాన్ ను ఒక నమ్మకమైన ఆయుధంగా పుతిన్ పేర్కొన్నారు. ఇప్పుడు దీనిని బయటకు తీశారంటే యుద్ధాన్ని మరింత విస్తరించి తన లక్ష్యాన్ని చేరుకునేందుకు రష్యా యత్నిస్తోందని దీనిని బట్టి అర్థం అవుతోంది.