కష్టకాలం: కేటీఆర్ సత్తా ఏంటో బయటపడుతుందా?
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను నెత్తిన పెట్టుకున్న నేతలంతా ఇప్పుడు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. తెలంగాణాలో బీఆర్ఎస్ ను నాయకులు వీడుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందని నలుగురు ఎమ్మెల్యేలు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఎందుకు అంటే నియోజకవర్గ అభివృద్ధి అంటున్నారు. గతంలో ఎమ్మెల్యేలకు అపాయిట్ మెంట్ కూడా ఇవ్వని కేసీఆర్, ప్రస్తుతం అడగ్గానే అపాయిట్ మెంట్ ఇస్తున్న రేవంత్ రెడ్డిని గులాబీ నేతలు పోల్చుకుంటున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే ఐదు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వశమయ్యాయి. మరో అయిదు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్, బీఆర్ఎస్ తప్ప మరే పార్టీ ఉండకూడదు అన్న ఉద్దేశంలో ఏ పార్టీలో గెలిచినా సరే తన పార్టీలో చేర్చుకునేవారు. 2019లో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. నిరంకుశ, అహంకార పాలనకు 2023 లో ప్రజలు చరమగీతం పాడారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే రానున్నకాలంలో వలసలు భారీగా ఉండే అవకాశం ఉంది. ఇదేంటని అడిగితే హస్తం తమ మాతృసంస్థ అని బదులిస్తున్నారు. ఇక కేటీఆర్ ఇలాఖాలోను గులాబీ నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. ఛైర్ పర్సన్ కు వ్యతిరేకంగా ఏకమయ్యారు. కేటీఆర్ వెంట నడిచేందుకు బీఆర్ఎస్ నాయకులు ఆసక్తి చూపడం లేదు. నాయకులు బీఆర్ఎస్ ను వీడుతున్నా ఆ సానుభూతి ప్రజల్లో ఏ మాత్రం కనిపించడం లేదు. కేసీఆర్, కేటీఆర్ అహంకార పూరిత, నియంత పాలనకు నిదర్శనం అనే చర్చ సాగుతోంది.