పవన్-బాబు సీట్ల కొట్లాట.. జగన్ లాభపడతారా?
టీడీపీ జనసేన పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కూటమిలోకి బీజేపీని తీసుకురావాలన్నది ఇరు పార్టీ అధినేతల అభిమతం. అయితే ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఎన్నిస్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారో తొలిసారిగా పవన్ తన మనసులో మాటను బయట పెట్టారు. ఏపీ అసెంబ్లీలో దాదాపు మూడో వంతు సీట్లు అంటే.. కచ్చితంగా 60 సీట్లు అన్నమాట. మొత్తం ఏపీలో 175 సీట్లు ఉండగా మూడో వంతు తమకు ఇవ్వాలన్నది జనసేన అభిమతం.
ఇప్పటివరకు ఈ విషయాన్ని జనసేన శ్రేయోభిలాషి కాపు సంక్షేమ సేన నేత అయిన హరిరామజోగయ్య చెబుతూ వచ్చారు. ఆయన ఇటీవల మంగళగిరి వెళ్లి మరీ పవన్ తో భేటీ అయ్యారు. ఓ వైపు టీడీపీ నేతలు 20-25 సీట్లు ఇస్తామని లీకులు ఇస్తున్న నేపథ్యంలో తాజాగా ఇప్పుడు పవన్ అదే సంఖ్యలో 60 సీట్లను కోరడం చర్చనీయాంశం అయింది.
అయితే టీడీపీ ఇన్ని స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందా అంటే లేదనే చెప్పవచ్చు. టీడీపీ ఉద్దేశం ఏంటంటే పూర్తి స్థాయిలో సింగిల్ గా మోజార్టీ సాధించాలి అని. జనసేనకు 60 సీట్లు కేటాయిస్తే ఇది సాధ్యం కాకపోవచ్చు. 140-150 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తే 80కిపైగా గెలుస్తాం. జనసేన 10-15లోపు గెలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఒకవేళ భవిష్యత్తులో జనసేన అడ్డం తిరిగినా ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవచ్చు. కానీ జనసేన కు మాత్రం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలి. వాళ్లపై ప్రభుత్వం ఆధారపడాలనేది పవన్ అభిమతం. కానీ మూడోవంతు సీట్లు ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా లేదు. ఏం జరుగుతుందో చూడాలి.