కమ్మలు, కాపులు కలుస్తారా? జగన్ను ఓడిస్తారా?
ఏపీలో సామాజిక వర్గం పార్టీని అంటు పెట్టుకొని ఉంటే తెలంగాణలో ఆ పరిస్థితి ఉండదు. ఏపీలో రెడ్డి సామాజిక వర్గం నేతలు వైసీపీని, కమ్మ ప్రజలు టీడీపీని, కాపు సామాజికవర్గం లో మోజార్టీ నాయకులు జనసేన వైపు నిలబడ్డారు. గత ఎన్నికల్లో ముద్రగడ్డ పద్మనాభం ఎపిసోడ్ తో టీడీపీపై కాపులు కొంత ఆగ్రహంగా ఉన్నారు. ఆ కోపంతో ఆ సామాజిక వర్గ నేతలంతా వైసీపీపి అండగా నిలిచారు. మరోవైపు కమ్మ నాయకులు టీడీపీ వైపు ఉన్నా బీసీల్లోనే ఆ పార్టీకి ఎక్కువగా పట్టుంది.
సీఎం జగన్ మోహన్ రెడ్డి తన సంక్షేమ పథకాల ద్వారా బీసీలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో తమ సామాజిక వర్గ నేతలను సైతం పక్కన పెట్టి బీసీ లను అక్కున చేర్చుకుంటున్నారు. ఇది టీడీపికి కొంత మైనస్ అనే చెప్పవచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్న టీడీపీ జనసేన లక్ష్యం నెరవేరుతుందా లేదా అన్నది చూడాలి.
జగన్ కు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం , మైనార్టీ వర్గాల్లో బలమైన పట్టుంది. ఎస్సీలో మాలలు 80 శాతం వైసీపీతోనే ఉన్నారు. అయితే కాంగ్రెస్ ఏమైనా పుంజుకొని రెడ్డి సామాజికవర్గాన్ని తమ వైపు తిప్పుకుంటే అది టీడీపీకి బలం అవుతుంది. గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచిన కాపులు ఈ సారి టీడీపీకి ఏ మేరకు సహకరిస్తారో చూడాలి. ఏపీలో ఉప్పు నిప్పుగా ఉన్న కాపులు, కమ్మలు కలుస్తారా అనే దానిపైనే ఆ కూటమి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.