కాంగ్రెస్ కొంప ముంచనున్న సీఎం కుర్చీ గోల?

కాంగ్రెస్ పార్టీ అంటేనే ముఠాల కొట్లాట అన్న పేరు గతంలో ఉండేది. గతంలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి, మర్రి చెన్నారెడ్డి వంటి వారు సీఎంలుగా పని చేసిన కాలంలోనూ అనేక గ్రూపులు ఉండేవి. నిత్యం అసమ్మతివాద రాజకీయాలకు కాంగ్రెస్ పెట్టింది పేరుగా ఉండేది. అయితే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సీఎం అయ్యాక ఆ సంస్కృతి చాలా వరకూ తగ్గింది. వైఎస్‌కు పార్టీలో ఎదురులేకపోవడం, ఆయన ప్రజాకర్షణ అందుకు కారణంగా నిలిచాయి.


కానీ ఇప్పుడు తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్‌లో సీఎంల గోల మొదలైంది. పార్టీకి కాస్త అనుకూలమైన వాతావరణం కనిపిస్తుండటంతో నేను సీఎం అంటే నేను సీఎం అన్న చర్చ మొదలైంది. దీనికి జానా రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పాలి. సీఎం కుర్చీ నన్ను వెదుక్కుంటూ వస్తుందని ఆయన ఇటీవల అన్న మాటలు కలకలం రేపాయి. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తాను కూడా సీఎం అవుతానన్నాడు. తాజాగా జగ్గారెడ్డి తన మనసులో కోరిక బయపెట్టాడు. అయితే ఆయన మాత్రం పదేళ్లలో సీఎం అవుతా అంటూ కాస్త గ్యాప్‌ ఉంచాడు.


అయితే.. అసలు నిజంగా తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిస్తే.. సీఎం అయ్యేదెవరు అన్న ప్రశ్న కూడా ప్రజల్లో ఆసక్తికర చర్చకు ఆస్కారం ఇస్తోంది. బీఆర్‌ఎస్ నేతలు కూడా ఇదే ప్రశ్న వేస్తున్నారు. మా సీఎం అభ్యర్థి కేసీఆర్... మీ అభ్యర్థి ఎవరని ప్రశ్నిస్తున్నారు. అయితే.. నిజంగానే కాంగ్రెస్‌ గెలిస్తే సీఎం సీటు ఆశించే వ్యక్తుల జాబితా మాత్రం చాలానే ఉంది. ఎందరు ఉన్నా.. అందుకు మొదటగా పరిశీలించే పేరు మాత్రం రేవంత్ రెడ్డిదే అవుతుంది.


ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. రేవంత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాకే కాంగ్రెస్‌కు ఊపొచ్చింది. అయితే అదే సమయంలో రేవంత్ రెడ్డి అంటే గిట్టనివారు కాంగ్రెస్‌లో చాలా మందే ఉన్నారు. ప్రత్యేకించి సీనియర్లకు రేవంత్ అంటే మంట. అందుకే ఆయన కంటే వివాదరహితుడైన భట్టి విక్రమార్కకు సీఎం సీటు ఇవ్వొచ్చని ఓ వాదన వినిపిస్తోంది. అందుకు ఆయన దళితుడు కావడం కూడా కలసివస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయితే రేవంత్‌ రెడ్డి.. లేదంటే భట్టి విక్రమార్క సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి అధిష్టానం ఎవరిని కరుణిస్తుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: