బీఆర్‌ఎస్‌లో గుబులురేపుతున్న కాంగ్రెస్ గ్యారంటీలు?

తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల హామీలు బీఆర్ఎస్‌లో గుబులు రేపుతున్నాయి. ఇటీవల విజయభేరి సభలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను సోనియా గాంధీ ప్రకటించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెల రూ.2500 అందిస్తామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించనున్నామని తెలిపారు. అంతే కాదు.. రైతు భరోసా ద్వారా రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15000 అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.


అలాగే వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12000 అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇంకా  గృహజ్యోతి కింద 200యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఇంటి స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందించనున్నామని గ్యారంటీల్లో పేర్కొన్నారు. యువ వికాసం ద్వారా చదువుకునే విద్యార్థులకు రూ.5లక్షల వరకు ఆర్ధిక సాయం అందించనున్నామని కాంగ్రెస్ గ్యారంటీ ఇచ్చింది.


ఇవేకాకుండా చేయూత పథకం ద్వారా రూ.4వేలు పెన్షన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వీటితో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10లక్షల ఆరోగ్య బీమా అందించనున్నట్టు కాంగ్రెస్ పార్టీ తన గ్యారంటీ కార్డుల్లో తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, ప్రజల అవసరాలకు, అనుగుణంగానే కార్యాచరణ ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి హారీష్ రావు వంటి వారు మొండి వాదనలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.


2023 సెప్టెంబర్ 16, 17, 18 తేదీలు దేశ రాజకీయాల్లో చరిత్రాత్మకమైనవిగా రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలపై ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అధికారం ఇస్తే మొదటి క్యాబినెట్ మీటింగ్‌లోనే ఈ గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ భరోసా ఇవ్వడం కూడా ప్రజలను ఆలోచింపజేస్తోంది. అయితే ఈ గ్యారంటీలు బీఆర్‌ఎస్ నేతల్లోనూ గుబులు రేపుతున్నాయి. అయితే తమ కేసీఆర్ ఇంతకంటే గొప్ప హామీలు ఇస్తారని వారు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRS

సంబంధిత వార్తలు: