ఆ సమాచారం చెబితే చాలు.. బహుమతులు, అవార్డులు ఇస్తారు?

ధాన్యం అమ్ముకునే మిల్లర్లు, రేషన్ బియ్యం పక్కదారి పట్టడాన్ని గుర్తించి సమాచారం అందించిన పౌరులకు సైతం రివార్డులు అందజేస్తామని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. అంతే కాదు.. తెలిపిన వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో 24 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పెరిగిందని గంగుల కమలాకర్ ప్రస్తావించారు.


ఆరింతలుగా పెరిగిన ఈ ధాన్యం సేకరణకు అనుగుణంగా మిల్లింగ్ కెపాసిటీ పెరగలేదని.. కేవలం గతానికి ఇప్పటికీ 2 రెట్లు మాత్రమే పెరిగిన నేపథ్యంలో మిల్లర్లకు అదనంగా ధాన్యం కేటాయింపులు చేయడం జరుగుతుందని.. ఇదే అదనుగా కొన్ని చొట్ల మిల్లర్లు అనైతిక చర్యలకు పాల్పడుతూ ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని గంగుల కమలాకర్ అన్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసులతోపాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి 125 శాతం క్యాష్ రికవరీ సైతం వసూలు చేస్తున్నామని గంగుల కమలాకర్ హెచ్చరించారు.


డిఫాల్ట్ మిల్లర్లు, అక్రమార్కులను ఉపేక్షించేది లేదని ఈ విషయంలో ఎలాంటి పక్షపాతం లేదని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల నుంచి 90 శాతం రికవరీ చేశామని, మిగతా 10 శాతం సైతం శరవేగంగా రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని గంగుల కమలాకర్ ప్రకటించారు. క్షేత్రస్థాయి పౌరసరఫరాల యంత్రాంగంతోపాటు కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించి నిరంతరం పర్యవేక్షణ చేస్తూ రికవరీలో వేగం సాధిస్తున్నారని గంగుల కమలాకర్ అన్నారు.


పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో జరిగిన బియ్యం అక్రమాలు సైతం విజిలెన్స్ బృందాలే పసిగట్టాయని.. బాధ్యులైన ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని గంగుల కమలాకర్ తెలిపారు. విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అక్రమాలను అరికట్టడానికి రాష్ట్ర స్థాయి విజిలెన్స్ బృందాలు స్థానిక యంత్రాంగంతో కలిసి పనిచేస్తున్నాయని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: