చంద్రబాబు.. రాయలసీమకు ద్రోహం చేస్తున్నారా?
రాయల సీమ గడ్డపై పుట్టిన చంద్రబాబు ఎన్నో పదవులు పొందారని... కానీ ఈ ప్రాంతం అభివృద్ధిని మాత్రం అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. చరిత్రలో రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబేనంటున్న ఆ నేతలు.. ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఎక్కడైనా ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని మంచి మనసుతో మూడు రాజధానులు చేస్తున్న వైయస్ జగన్ ఆలోచన చేస్తున్నారని చెబుతున్న వైసీపీ నేతలు.. కొత్త రాష్ట్రం డిమాండు రాకుండా అన్నింటికి వికేంద్రీకరణ ద్వారా జగన్ పరిష్కారం చూపుతున్నారని చెబుతున్నారు.
కర్నూలుకు చెందిన స్థానిక టీడీపీ నాయకులు కూడా తమ రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించాలని వైసీపీ సీమ నాయకులు సూచిస్తున్నారు. రాయల సీమ గడ్డపై చంద్రబాబు తిరగాలంటే, ఓట్లు, సీట్లు కావాలంటే మూడు రాజధానులకు, న్యాయ రాజధానికి మద్దతు ఇవ్వాల్సిందేనని వైసీపీ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ డిమాండు చేశారు. చంద్ర బాబు తన ఐదేళ్ల పాలనలో సీమకు ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా అని వైసీపీ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ నిలదీశారు.
ఇప్పటికే వైయస్ జగన్ ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారన్న వైసీపీ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్.. చంద్రబాబు తన కుమారుడికి దొడ్డిదారిన మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఇకనైనా చంద్రబాబు.. తాను పుట్టిన రాయల సీమ గడ్డకు న్యాయం చేసేలా వ్యవహరించాలని వైసీపీ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ సూచిస్తున్నారు.