మల్లారెడ్డి సేఫ్.. ఇక రేవంత్ రెడ్డి ఏమీ చేయలేడా..?
మంత్రి మల్లారెడ్డి భూ అక్రమాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోరుగా విమర్శలు చేస్తుండటంతో అందరి ఫోకస్ మల్లారెడ్డిపై పడింది. దీనికి తోడు.. రేవంత్ రెడ్డి మల్లారెడ్డి భూ అక్రమాలపై విచారణ కోసం కేసీఆర్కు సవాల్ విసిరారు. ఇదే సమయంలో స్పందించిన మల్లారెడ్డి ఏకంగా లైవ్లో తొడగొట్టి
రాజీనామా చేసి పోటీ చేద్దాం రా.. అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.. ఇప్పుడు ఆ సవాల్కు స్పందించిన రేవంత్ రెడ్డి.. నిన్ను ఎప్పుడో ఓడించాను.. ఇక ఓడించాల్సింది కేసీఆర్నే అంటూ రంకెలేశారు.
అంతేకాదు.. ఇవిగో మల్లారెడ్డి భూ అక్రమాలు అంటూ కొన్ని కాగితాలు తీసుకొచ్చి సర్వే నెంబర్లు చదివి.. ఫలానా భూమిని అనేకసార్లు అమ్మేశారని.. ఇప్పడు దాన్ని చూపించే యూనివర్శిటీకి మల్లారెడ్డి పర్మిషన్ తెచ్చుకున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించాడు. అయితే ఇలాంటి భూ అక్రమాల ఆరోపణలు మల్లారెడ్డిపై కొత్త కాదు. అంతే కాదు.. ఈటల ఎపిసోడ్ సమయంలోనే మల్లారెడ్డిపైన కూడా వేటు పడుతుందని పుకార్లు షికారు చేశాయి. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి సాక్ష్యాధారాలు అంటూ గట్టిగానే మాట్లాడుతున్నారు.
అయితే.. కేటీఆర్ కూడా మల్లారెడ్డి తాజాగా బాగా వెనకేసుకు రావడంతో ఆయన పదవికి ఢోకా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మల్లారెడ్డిపై ఏదైనా అసంతృప్తి ఉన్నా.. పదవి నుంచి తొలగించే అవకాశం ఉన్నా.. ఇలా కేటీఆర్ బహిరంగంగా సమర్థించేవారు కాదని.. కాబట్టి ఇక మల్లారెడ్డి పదవికి ఢోకా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.