హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు ఢిల్లీలో ఎందుకు అడుగుపెట్టడం లేదు ?

Vijaya
క్షేత్రస్ధాయిలో  జరుగుతున్నది చూస్తుంటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  ఎందుకంటే ఒకపుడు ఢిల్లీలో ఒంటిచేత్తో చక్రం తిప్పానని చంద్రబాబు చెప్పుకునే వాడు.  అలాంటిది ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఢిల్లీకి వెళ్ళి దాదాపు ఏడాదిన్నరయిపోయింది.  అప్పట్లో అవసరం లేకపోయినా జాతీయ స్ధాయి నేతలతో రాసుకుపూసుకుని తిరిగేందుకు ఢిల్లీకి తరచూ వెళ్ళిన విషయం అందరు చూసిందే. మరిపుడు ఆ మిత్రులంతా ఏమయ్యారు ? ఆ వైభవం అంతా ఏమైపోయింది ?  అంటే  పార్టీ నేతలే సమాధానాలు చెప్పలేకపోతున్నారు.  చంద్రబాబు ఢిల్లీ వైభవం అంతా ఇక చరిత్రగానే మిగిలిపోయేట్లుంది చూస్తుంటే.




నిజానికి గడచిన ఏడాదిన్నరలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం కూడా రాలేదనే చెప్పాలి.  ఎందుకంటే జాతీయస్ధాయి నేతలంతా చంద్రబాబుకు దూరమైపోయారు. దూరమైపోయారనేకన్నా కావాలనే అందరు చంద్రబాబును దూరం పెట్టేస్తున్నారన్నది కరెక్టు. ఎందుకంటే ఏ ఒక్క జాతీయస్ధాయి నేతతో కూడా చంద్రబాబుకు సక్రమమైన సంబంధం లేదు. అవతల ఎంత పెద్ద నేతైనా కావచ్చు అవసరం అనుకుంటే వాడుకోవటం అవసరం తీరిపోయిన తర్వాత తీసి అవతల పడేయటమే చంద్రబాబుకు తెలిసిన విద్య. ఈ పద్దతి జరిగినంతకాలం జరిగింది. ఎప్పుడైతే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడో అప్పటి నుండే చంద్రబాబు వ్యూహాలన్నీ ఎదురుతిరిగటం మొదలుపెట్టాయి. దాంతో ఎవరు కూడా చంద్రబాబు వైపు చూడటం లేదిపుడు.




అధికారంలో ఉన్నంత కాలం ఏదో అవసరాలుంటాయి కాబట్టి చంద్రబాబు పిలిస్తే పలికేవారు. కానీ అవసరం తీరిపోయిన తర్వాత కరివేపాకులాగ వాడుకుని వదిలేస్తాడని ముద్ర పడిన తర్వాత ఇక ఇపుడు ఎవరు పట్టించుకుంటారు ? ఆమధ్య జమ్మూ-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ చంద్రబాబుపై మండిపోయాడు. అవసరమున్నపుడు వాడుకుని తర్వాత వదిలేసి నైజం చంద్రబాబుది అంటూ ధ్వజమెత్తాడు. మొన్నటి ఎన్నికల్లో ఒమర్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాతో రాష్ట్రంలో టీడీపీకి ప్రచారం చేయించుకున్న విషయం అందరికీ తెలిసిందే.  తర్వాత జరిగిన పరిణామాల్లో  కొందరు మాజీ ముఖ్యమంత్రులు, కీలక నేతలను కేంద్రప్రభుత్వం కాశ్మీర్ లోనే హౌస్ అరెస్టులో ఉంచింది. హౌస్ అరెస్టయిన వారిలో ఫరూఖ్ ఉన్న విషయం తెలిసినా చంద్రబాబు నోరిప్పలేదని ఒమర్ కు మంట.




ఇలా చెప్పుకుంటు పోతే చంద్రబాబు బాధితులు చాలామందే ఉన్నారు. పశ్చిమబెంగాల్లో సిఎం మమతాబెనర్జీ-కేంద్రానికి మధ్య ఎంత వివాదం రేగుతోందో  అందరు చూస్తున్నదే. అన్నీ విషయాలు తెలిసినా మమతకు ఫోన్ చేసి చంద్రబాబు మద్దతుగా నిలవలేదు. ఎందుకంటే ఇపుడు మమతతో చంద్రబాబుకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు మళ్ళీ నరేంద్రమోడి దగ్గరకు వెళ్ళాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. మోడికి దగ్గరవ్వాలని ఒకవైపు ప్రయత్నిస్తు మరోవైపు తన వ్యతిరేకులతో మాట్లాడినట్లు మోడికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా ? ఈ కారణంతోనే  అందరినీ చంద్రబాబు దూరంగా పెట్టేశాడు. కాబట్టే ఢిల్లీకి కూడా వెళ్ళటం లేదు. మోడికి చంద్రబాబు మళ్ళీ దగ్గరవుతాడా లేదా అన్నది వేరే విషయం. ప్రస్తుతానికైతే చంద్రబాబు ఢిల్లీలో అడుగుపెట్టడం లేదన్నది వాస్తవం. చూద్దాం ఎప్పుడు అడుగుపెడతాడో ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: