హెరాల్డ్ ఎడిటోరియల్ : వైసిపి ఓటమి ఖాయమా ?... కుర్చీపై చంద్రబాబుకు ఎంతాశ ?
చంద్రబాబు ఆశంతా జమిలి లేదా ఎర్లీ ఎన్నికలపైనే పెట్టుకున్నాడు. అసలు జమిలి ఎన్నికలు కానీ లేదా ఎర్లీ ఎన్నికలు కానీ ఎందుకు వస్తాయని చంద్రబాబు అనుకుంటున్నాడో ఎవరికీ అర్ధం కావటం లేదు. జమిలి ఎన్నికలు జరపాలని ఒకపుడు ప్రధానమంత్రి నరేంద్రమోడి ఆసక్తి చూపించింది వాస్తవం. ఇందులో భాగంగానే అప్పట్లో కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా అన్నీ రాజకీయ పార్టీలతో సమావేశాలు పెట్టింది. ఆ సమావేశంలో దాదాపు అన్నీ పార్టీలు జమిలి ఎన్నికల నిర్వహణను వ్యతిరేకించాయి. స్వయంగా బిజెపి పార్టీ కూడా వ్యతిరేకించింది. దాంతో ఆ ప్రతిపాదన కోల్డు స్టోరేజీలో పడిపోయింది. కాబట్టి జమిలి ఎన్నికలు జరిగే అవకాశాలు దాదాపు లేదన్న విషయం తేలిపోయింది.
ఇక ఎర్లీ పోల్స్ అని చంద్రబాబు ఎందుకంటున్నాడో అర్ధం కావటం లేదు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎర్లీ పోల్స్ వచ్చే సూచనలేమీ కనబడటం లేదు. కోర్టుల్లో విచారణ జరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని జగన్ కు బెయిల్ రద్దవుతుందని చంద్రబాబు చాలా ఆశతో ఉన్నట్లున్నాడు. ఒకవేళ బెయిల్ రద్దయి జగన్ మళ్ళీ జైలుకు వెళ్ళినా ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కూడా ఏమీ కనబడటం లేదు. ఎందుకంటే జగన్ భార్య భారతిరెడ్డి కానీ లేకపోతే మరోకరో సిఎం అవుతారు కానీ ప్రభుత్వం ఎందుకు కూలిపోతుంది ? ఎందుకు ఎర్లీ పోల్స్ వస్తాయి ? ఒకవేళ చంద్రబాబు ఆశిస్తున్నదే జరిగితే ఇపుడున్న 23 అసెంబ్లీ సీట్లు కూడా వస్తాయా ? అనేది డౌటే. ఆ విషయాన్ని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు లేదు.
చంద్రబాబు కోరుకుంటున్నట్లు ఇప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినా జనాలు టిడిపిని ఎందుకు ఎన్నుకుంటారు ? అనే విషయంలో ఎల్లోబ్యాచ్ సమాధానం చెప్పగలదా ? ప్రజా వ్యతిరేకపాలనతో విసిగిపోయే కదా టిడిపిని జనాలు ఘోరంగా ఓడించింది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎల్లోబ్యాచ్ ప్రచారం చేస్తున్నట్లుగా జగన్ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నట్లు కనబడటం లేదు. పైగా సంక్షేమ కార్యక్రమాలను విపరీతంగా అమలు చేస్తున్నాడు. మామూలుగా ఏ ముఖ్యమంత్రి కూడా తన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ లాగ అమల్లోకి తెచ్చింది లేదు. ఇదే సమయంలో ప్రతిపక్షంగా టిడిపి ఏమన్నా ఊడబొడిచేసిందా అంటే అదీలేదు. మరి టిడిపికి ఎందుకు అధికారం కట్టబెట్టాలో చంద్రబాబు కూడా చెప్పలేకపోతున్నాడు. కాబట్టి నిజంగానే మధ్యంతర ఎన్నికలొస్తే టిడిపికి ఇపుడున్న సీట్లు కూడా తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది.