ఠాగూర్ పోయే.. ఠాక్రే వచ్చే.. కాంగ్రెస్ బాగుపడేనా?
ఇవాళ ఉదయం దిల్లీ నుంచి విమానంలో బయలుదేరిన మానిక్రావు ఠాక్రే శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరు కుంటారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా గాంధీ భవన్కు చేరుకుంటారని తెలుస్తోంది. మొదటిసారిగా రాష్ట్రానికి ఇంఛార్జి హోదాలో వస్తున్నమానిక్రావు ఠాక్రేకు గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఉదయం 10.30 గంటలకు మానిక్రావు ఠాక్రే ఏఐసీసీ కార్యదర్శులతో ప్రత్యేకంగా భేటీ అవుతారని తెలుస్తోంది. ఆ తర్వాత 11.30 నుంచి అర గంటలపాటు రేవంత్తో మానిక్రావు ఠాక్రే సమావేశమై రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ఇతర అంశాలపై విస్తృతంగా చర్చిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కూడా మానిక్రావు ఠాక్రే ప్రత్యేకంగా సమావేశం అవుతారట.
ఇక మధ్యాహ్నం 12.30 గంటలకు గంటన్నరపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులతో మానిక్రావు ఠాక్రే సమావేశం అవుతారు. మధ్యాహ్నం 3 నుంచి గంటపాటు రాజకీయ వ్యవహారాల కమిటీతో మానిక్రావు ఠాక్రే సమావేశమవుతారు. ఆ తర్వాత కార్యనిర్వాహక కమిటీ, పీసీసీ ఆఫీస్ బేరర్లతోనూ మానిక్రావు ఠాక్రే సమావేశం అవుతారు. రేపు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతోనూ మానిక్రావు ఠాక్రే సమావేశం అవుతారు.