శభాష్.. వెంకన్న సొమ్ముతో క్యాన్సర్ ఆస్పత్రి?
ఇప్పటివరకు 1000మందికి పైగా పేద పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసి వారికి కొత్త జీవితం ప్రసాదించామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి లేకుండాపోయింది. అదువల్ల తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోనే ఆసుపత్రి నిర్మించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రూ. 350 కోట్లతో సకల సదుపాయాలతో దేశంలోనే అత్యుత్తమంగా చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించబోతున్నారు.
బర్డ్ ఆస్పత్రిలో ఉచితంగా గ్రహణమొర్రి, కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేసేలా ఏర్పాటు చేశారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. క్యాన్సర్ తో రాష్ట్రంలో ఏ ఒక్కరు మరణించరాదనే ఉద్దేశంతో రాష్ట్రంలో తిరుపతిలోనూ.. గుంటూరు-విజయవాడ మధ్య, విశాఖపట్నం లో క్యాన్సర్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని సీఎం వైయస్ జగన్ నిర్ణయించారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. క్యాన్సర్ చికిత్సల ప్రముఖ వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును సలహాదారుగా నియమించారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో మొదటి ఆస్పత్రి తిరుపతిలో నిర్మించాలని నిర్ణయించినట్లు వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
స్విమ్స్ కు అనుబంధంగా శ్రీబాలాజీ క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి పూనుకున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రస్తుతం స్విమ్స్ లో ఉన్న భవనాన్ని క్యాన్సర్ ఆస్పత్రికి అవసరమైన విధంగా మార్పులు చేయాలని.. యుద్ధ ప్రాతిపదికన డీపీఆర్ తయారు చేసి సమర్పించాలని వైవీ సుబ్బారెడ్డి సిబ్బందిని కోరారు.