పాత జబ్బే.. కొత్తగా వణికిస్తోంది..ఈ టీకా మస్ట్‌?

కరొనా, మంకీ పాక్స్ వంటి కొత్త జబ్బులే కాదు.. పాత జబ్బులు కూడా కొత్తగా వణికిస్తున్నాయి. అలాంటి వాటిలో మనకు చాలా పరిచయమైన మీజిల్స్ ఒకటి.. దీన్ని తెలుగు రాష్ట్రాల్లో తట్టు లేక ఆటలమ్మ, అమ్మవారు.. వంటి పేర్లతో పిలుస్తారు. పిల్లల్లో వచ్చే ఈ జబ్బు అంత ప్రమాదకరం కాకపోయినా.. ఇప్పుడు ఉత్తరాదిలో పిల్లల ప్రాణాలు తీస్తోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఆందోళనకర స్థాయిలో తట్టు లేదా అమ్మవారు వ్యాధి కేసులు పెరుగుతున్నాయి.

ఇటీవల బీహార్ , గుజరాత్, హర్యానా, జార్ఖండ్ , కేరళ, మహారాష్ట్రల్లో తట్టు కేసులు..... ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి.  ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ సమస్యను నివారించడానికి  9 నెలల నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలందరికీ తట్టు, పొంగు టీకాలను అదనపు డోసుగా ఇవ్వాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. తాజాగా బృహన్  ముంబయి మున్సిపల్  కార్పొరేషన్ ,  ఇతర మహారాష్ట్ర జిల్లాల్లో  ఇటీవల తట్టు కేసుల సంఖ్య బాగా పెరిగింది.

ఆ ఒక్క రాష్ట్రంలోనే పది మంది చిన్నారులు తట్టుతో మరణించారు. మహారాష్ట్ర సహా ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖ అధికారులకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్యశాఖ  కేసుల పెరుగుదలపై అప్రమత్తం చేసింది. ఆయా భౌగోళిక ప్రాంతాల్లో ఇన్ ఫెక్షన్  సోకిన పిల్లలంతా వ్యాక్సిన్  తీసుకోనివారేనని, ఆయా ప్రాంతాల్లో.. వ్యాక్సిన్  తీసుకున్నవారి సంఖ్య జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని కేంద్రం పేర్కొంది. అందుకే  9 నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు అదనపు డోసుగా తట్టు, పొంగు టీకాను ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి పి.అశోక్  బాబు రాష్ట్రాలను కోరారు.

సాధారణంగా తట్టు,పొంగు టీకాలను  9 నుంచి 12 నెలల వయసులో మొదటి డోసు, 16 నుంచి 24 నెలల్లోపు రెండో డోసుగా ఇస్తారు. తాజా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఐదేళ్లలోపు వారికి అదనపు డోసుగా ఇవ్వాలని కేంద్రం సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: