దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ?
యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపితేనే భవిష్యత్కు మేలు చేస్తుంది. ఖమ్మం జిల్లాలో వెంకటేశ్వర్లు అనే రైతు యాసంగిలో పత్తి సాగు చేసి 18 క్వింటాళ్లు సాధించారు. రైతును మించిన శాస్త్రవేత్తలు లేరు అనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. శాస్త్రవేత్తలు కూడా కాలానికి అనుగుణంగా మారాలి. రాబోయే యాసంగిలో పెద్ద ఎత్తున పత్తి సాగుకు తెలంగాణ రైతులు సిద్దమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 20 దేశాలకు విత్తనాలను ఎగుమతి చేస్తున్నారు.
ప్రపంచంలోని మరిన్ని దేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి చేరాలి. తెలంగాణ, ఆంధ్రలో దాదాపు ఏడు లక్షల మంది విత్తన రైతులు ఉన్నారు. విత్తనాలు, వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కేంద్రం దృష్టి సారించడం లేదన్న ఆవేదన ఉంది. దేశం నుండి ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో అనేక ఆంక్షలు పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక విధానం లేదని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.
నాలుగేళ్లు కాదు ఎనిమిదేళ్లు కరవొచ్చినా పంటలు పండించే స్థాయికి తెలంగాణ వ్యవసాయం ఎదిగిందని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి అంటున్నారు. భారత ప్రజల ఆహార అవసరాలు తీర్చే స్థితికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని ఆయన అభిప్రాయపడుతున్నారు.