జగన్ దెబ్బతో చంద్రబాబు దారులన్నీ కుప్పానికే దారితీస్తున్నాయే...!
మాకు తిరుగులేదు.. మాకు ఎదురు లేదు.. అనుకున్న చోట.. వైసీపీ అధినేత జగన్ మొగుడై కూర్చున్నాడు. కళ్లుమూసుకున్నా.. గెలుపు నాదే.. అనుకున్న నియోజకవర్గంలో.. గత 2019 ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన గట్టి పోటీతో మెజారిటీ తగ్గిపోవడం.. తొలి దెబ్బగా చంద్రబాబు భావిస్తున్నారు. నిజానికి అప్పటి వరకు ఆయన ఏడాది ఒక సారి అది కూడా సంక్రాంతి సమయంలో కుప్పంలోని నారావారి పల్లెకు వెళ్లి.. భోగి మంటలు వేసి.. చలికాచుకుని వచ్చేసేవారు. ఇక, ఆ తర్వాత.. ఆ నియోజకవర్గం ముఖం కూడా చూసేవారు. నిజమే.. సీఎంగా ఆయన బిజీగా ఉన్నప్పుడు.. అయితే.. ఇలానే అనుకోవచ్చు.
కానీ, విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన నియోజకవర్గం జోలికి పోలేదు. ఎందుకంటే..తనను ఎదిరించే వ్యూహాలు అప్పటి ప్రత్యర్థి పార్టీలు వేయలేదు. అంతేకాదు..తనను ఎదిరించే నాయకుడు కూడా కుప్పంలో పుట్టలేదని.. ఆయన భావించి ఉండొచ్చు. కానీ, పరిస్థితులు..రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా.. అందుకే ఆయనకు ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం కంచుకోటను జగన్ బద్దలు కొట్టారు. పంచాయతీ, పరిషత్, ఆ తర్వాత జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది.
దీంతో చంద్రబాబు పైకిచెప్పకపోయినా.. కనిపించకపోయినా.. ఉలికిపాటుకు మాత్రం గురయ్యారు. దీంతో పార్టీని, తన ఉనికిని కాపాడుకునేందుకు బాబు దిగిరాక తప్పలేదు. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల తర్వాత తన ఏకాగ్రతను పూర్తిగా కుప్పంపైనే పెట్టారు. జనవరిలో రెండో వారంలో ఆయన కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించారు. నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక, ఇప్పుడు మరోసారి.. మార్చి మొదటి వారంలో కుప్పంలో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. చంద్రబాబు దారి.. ఇప్పుడు కుప్పం రహదారి! అనే కామెంట్లు సొంత పార్టీలోనే వినిపిస్తుండడంగమనార్హం.