విధి ఆడిన నాటకం.. సర్పంచ్ కట్టించిన స్మశాన వాటికలో.. ఆయనకే దహన సంస్కారం?
స్మశాన వాటిక ఏర్పాటు చేయడం ద్వారా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి అంత్యక్రియలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్మశాన వాటికలోనే నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని సర్పంచులు భావిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక సర్పంచ్ కూడా ఇలాగే దగ్గరుండి మరి చొరవ తీసుకొని స్మశాన వాటికను వేగంగా నిర్మించారు. కానీ ఆ స్మశాన వాటికలో తన అంత్యక్రియలతోనే ప్రారంభమవుతుంది అని మాత్రం ఊహించలేకపోయాడు. విధి ఆడిన వింత నాటకంలో ఆయన నిర్మించిన స్మశాన వాటికలోనే మొదట అంత్యక్రియలు ఆయనవే జరిగాయి.
ఈ దురదృష్టకర ఘటన హనుమకొండలో వెలుగులోకి వచ్చింది. పరకాల మండలం హైబోతు పల్లి గ్రామ సర్పంచ్ కుమారస్వామి ఆధ్వర్యంలో కొంతకాల క్రితమే గ్రామంలో కొత్త స్మశానవాటిక నిర్మించారు. అయితే ఇంకా ఆ స్మశాన వాటిక ప్రారంభం జరగలేదు. ఇంతలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు రావడంతో భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో మనస్థాపానికి గురైన సర్పంచ్ ఇటీవలే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించారు. అయితే ఇటీవల చివరికి పరిస్థితి విషమించడంతో చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. అయితే సర్పంచ్ కుమారస్వామి కట్టించిన స్మశాన వాటికలోనే ఆయన మృతదేహానికి కుటుంబ సభ్యులు తొలి దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో గ్రామస్తులు అందరూ కూడా కంటనీరు పెట్టుకున్నారు.