దారుణం: ప్రేమ జంట అదృశ్యం.. యువతి మృతి..!

N.ANJI
గతకొన్నాళ్ళుగా వారిద్దరూ ఒక్కరినినొక్కరు ప్రేమించుకున్నారు. ఇక ఇద్దరు పెళ్లి చేసుకొని అన్యోన్యంగా జీవనం సాగిద్దాం అని ఎన్నో కలలు కన్నారు. అంతబాగానే ఉన్నా.. అబ్బాయి కన్నా అమ్మాయి నాలుగేళ్లు పెద్దది కావడం, మరోవైపు వాళ్ళిద్దరి కులాలు వివాహానికి అడ్డురావడంతో బతికి విడిపోవడం కన్నా.. చనిపోయి కలిసి ఉందాం అని అనుకున్నారు. ఇక ఇద్దరు రాయపల్లి బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి భగత్ సింగ్ నగర్ కు చెందిన బెంగరి కృష్ణవేణి అదే పట్టణం పక్కనున్న రాజాం పేటకు చెందిన తడ్కల్ అనిల్కు గత కొన్ని రోజుల క్రితం పరిచయమైంది. వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఇరువురికి వేరు వేరు కులాలు కావడంతో వీరి పెళ్లికి ఆటంకాలు వస్తాయనే ముందే భావించారు. అయినప్పటికీ వారిద్దరూ ఒకసారి పెద్దవారికి చెప్పి చూద్దామని ఇరు కుటుంబాల పెద్దలను కలిసి వారి ప్రేమ విషయం చెప్పారు.
అయితే ఇద్దరికీ వయసు మధ్య వ్యత్సాసం ఉందనీ, వేరువేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకారం తెలుపలేదు. ఇక ఈ నెల 5వ తేదీన కృష్ణవేణి, అనిల్ ఇద్దరు కలిసి ఇంట్లో నుంచి బయటికి వచ్చారు. కాగా.. ఈ ఘటన పై ఇరు కుటుంబ సభ్యులు వేరువేరుగా సంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా సంగారెడ్డి మీదుగా ద్విచక్ర వాహనంపై ముబై హైవే నుంచి రాయిపల్లి బ్రిడ్జ్ వైపు  వెళ్లినట్లు పోలీసులు సిసి ఫుటేజ్ ద్వారా ఇద్దరినీ గుర్తించారు
ఇక సిర్పూర్ మంజీర నదిలో ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు నదిలో దొరికిన మృతదేహం కృష్ణవేణిదే అని గుర్తించారు. అలాగే అనిల్ మృతదేహం కూడా నీటిలోనే ఉంటుందనే అనుమానం తో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: