కొర్రమీను కర్రీ వండటం రాని వాళ్ళు చూసి నేర్చుకోండి...!
కొర్రమీను చేపలు అర కేజీ తీసుకోండి. ధనియాల పొడి - రెండు టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టీ స్పూన్లు, ఉల్లిపాయ – ఒకటి కావాలి. మీరు తినే అంత ఉప్పు వేసుకోండి. పసుపు - అర టీ స్పూన్ చాలు. కారం- రెండు టీస్పూన్లు కావాలి. జీలకర్ర పొడి - అర టీ స్పూన్, మెంతి పొడి - అర టీ స్పూన్, చింత పండు - యాభై గ్రాములు కావాలి. నూనె – సరిపడా వేయండి. కరివేపాకు - కొద్దిగా, కొత్తిమీర – ఒక కట్ట చాలు.
తయారీ ఎలా అంటే, ముందుగా చేపలను ఉప్పుతో బాగా శుభ్రం చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక బౌల్ లోకి చేప ముక్కలు తీసుకొని అందులో చింత పండు రసం, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, మెంతి పొడి వేసి బాగా కలపండి. కాసేపు వీటిని పక్కన పెడితే చేప ముక్కలకు మసాలా బాగా పట్టుకునే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు ఒక పాన్లో నూనె వేసి కాస్త వేడి అయిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించండి. ఉల్లిపాయలు వేగాక ధనియాల పొడి వేసుకోవాలి. వెంటనే చేప ముక్కలు వేసి కలపండి. ఆ తరువాత కరివేపాకు వేయండి. అలాగే తగినంత ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించండి. అయితే గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు కూడా పోయండి. కొర్రమీను ముక్కలు ఉడికిన తరువాత కొత్తిమీర వేసుకొని దించండి.