ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తానూ కేసీఆర్ బాధితుడినేనని ఏకంగా నిందితుడు చెబుతున్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ఈ షాకింగ్ విషయం వెల్లడించారు. ఈ కేసు నమోదైనప్పటి నుంచి అమెరికాలో ఉన్న ప్రభాకర్రావు... ప్రధాన నిందితుడిగా మారిన తర్వాత తొలిసారి కోర్టుకి సమర్పించిన అఫిడవిట్లో కీలక విషయాలు వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి కులం తనది ఒకటే కావడం వల్లే ఎస్ఐబీ చీఫ్గా నియమించినట్లు పోలీసులు చెబుతున్నట్లుగా అందులో నిజంలేదన్నారు. తానూ కేసీఆర్ బాధితుడినేనని తెలిపారు. అప్పట్లో విపక్ష నేతలకు మద్దతిస్తున్నట్లు టీఆర్ఎస్ జిల్లా నేతలు చెప్పారని.. అక్కడినుంచి సీఐడీకి బదిలీ చేశారని చెప్పారు. డీఐజీ నుంచి ఐజీగా పదోన్నతి కల్పించేందుకు ఐదు నెలలు ఆలస్యం చేశారని తెలిపారు.
ఎస్బీబీ చీఫ్గా అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ పర్యవేక్షణలోనే పనిచేశానని.. ప్రతిఅంశాన్ని వారి నోటీస్లో ఉంచినట్లు ప్రభాకర్ రావు చెప్పారు. అక్కడ స్వతంత్రంగా పనిచేసే అధికారం ఉండదని ప్రభాకర్ రావు అన్నారు. 30ఏళ్ల సర్వీసులో ప్రతిభతో ఎన్నో పురస్కారాలు పొందినట్టు ప్రభాకర్ రావు వివరించారు.