హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవానికి చేయాల్సిన ఏర్పాట్లను హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. ఆయన వెంట జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ కూడా ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి పలువురు పోలీసు, జీహెచ్ఎంసి ఉన్నతాధికారులతో ట్యాంక్బండ్, నెక్లస్రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ పాంతాల్లో నిన్న పర్యటించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం హుస్సేన్సాగర్ తీరాన మొత్తం ఎన్ని క్రేన్లు ఏర్పాటు చేయాలి, ఎంత మంది పోలీసు, జీహెచ్ఎంసి, ఇతర ప్రభుత్వ విభాగాల సిబ్బంది విధుల్లో ఉండాలి అనే అంశాలను అంచనా వేశారు.
అలాగే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం చేసే ప్రాంతంలో ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే పలు విషయాలపై ఆయా శాఖల అధికారులకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచనలు చేశారు. గత ఏడాది కంటే ఈసారి విగ్రహాలు నిమజ్జనం కోసం అధికంగా వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆనంద్, రోనాల్డ్ రోస్ సూచించారు.