మణిపుర్లో మెయిటీ, కుకీ తెగల మధ్య గతనెలలో మొదలైన ఘర్షణల్లో ఇప్పటివరకు 100మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మణిపుర్లో నెలరోజుల నుంచి కొనసాగుతున్న హింసాత్మక ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై మోదీ ఎందుకు నోరు విప్పటం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రధాని మోదీ..తాజాగా మరో మన్ కీ బాత్లో మాట్లాడారు కానీ.. మణిపుర్ అల్లర్లపై మాత్రం మౌనం వీడటం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తాజాగా ఎద్దేవా చేశారు.
విపత్తు నిర్వహణలో గొప్ప సామర్థ్యంపై తన భుజాన్ని తానే తట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. మణిపుర్ ఎదుర్కొంటున్న మానవసృష్టి విధ్వంసం సంగతిపై మాట్లాడరెందుకని జైరాం రమేష్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు శాంతి కోసం పిలుపు నరేంద్ర మోదీ ఇవ్వకపోవటాన్ని జైరాం రమేష్ తప్పుపట్టారు. ఆడిట్ చేయని పీఎం కేర్స్ ఫండ్ ఉందని.. కానీ నిజమైన ప్రశ్న మణిపుర్ను ప్రధాని మోదీ పట్టించుకుంటారా అని జైరాం రమేష్ విమర్శించారు.