రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్ లో శాసనసభ ఎన్నికల నిర్వహణకు బీజేపీ సర్కారు రెడీ అవుతోందా.. తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల ఖాతాలో మరో రాష్ట్రాన్ని జత చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోందా.. అంటే అవుననే అనిపిస్తోంది. రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్ లో శాసనసభ ఎన్నికల నిర్వహణపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్ లో రెండు రోజుల పర్యటించిన ఆయన ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్ లో శాసనసభ ఎన్నికలు ఏడాది లోపు జరగొచ్చంటూ వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతోంది. ఇటీవలే జమ్మూకాశ్మీర్లో నియోజకవర్గాల పునర్ విభజన ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అసెంబ్లీ సీట్ల సంఖ్య కశ్మీర్ ప్రాంతంలో 47, జమ్మూలో 43కు పెరిగాయి. జమ్మూకశ్మీర్ లో 2018 జూన్ నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్రం 2019లో రద్దు చేసిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ను రెండు వేర్వేరు కేంద్ర పాలిత ప్రాంతాలుగా బీజేపీ సర్కారు ఏర్పాటు చేసింది.