వైసీపీ దగ్గర వున్నది కిరాయి మూకలైతే.., టీడీపీ దగ్గర ఉన్నది పార్టీ అంటే ప్రాణం పెట్టే లక్షలాది మంది సైనికులంటున్నారు టీడీపీ నేత నారా లోకేశ్. దళిత మహిళ కర్లపూడి వెంకాయమ్మపై వైసీపీ నేతల దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ ఖండించారు. వెంకాయమ్మకి సమాధానం చెప్పే దమ్ములేని వైసీపీ నాయకులు కంతేరులోని ఆమె ఇంటిపై దాడి చేసి బెదిరించారని మండిపడ్డారు. జగన్రెడ్డి పాలనలో పేదల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ఐదుకోట్ల ఆంధ్రుల అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు వెంకాయమ్మ చెప్పారని ఆమె చేసిన వ్యాఖ్యల వీడియోను లోకేశ్ విడుదలచేశారు.
వెంకాయమ్మ, ఆమె కుటుంబసభ్యులకు ఎటువంటి హాని తలపెట్టినా తీవ్రపరిణామాలు తప్పవని హెచ్చరించారు. నిరక్షరాస్య, నిరుపేద, దళిత మహిళ వెంకాయమ్మ మాటే ఏపీలో ప్రతీ ఇంటా, ప్రతీనోటా వినిపిస్తోందని విమర్శించారు. ఐదుకోట్లమందిపైనా జగన్ రెడ్డి దాడి చేయిస్తారా అని లోకేశ్ నిలదీశారు.