తెలంగాణలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా.. రోజూ కోచింగ్ కోసం ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్నారా.. అయితే మీకు శుభవార్త.. ఇకపై పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. వీరు హైదరాబాద్ సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్లపై 20శాతం రాయితీ పొందొచ్చు. వీరికి మూడు నెలలపాటు ఈ పాస్లను కొనసాగిస్తామని ఆర్టీసీ వెల్లడించింది. ఈ బస్పాస్ల కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు ఆధార్ కార్డు జిరాక్స్, కోచింగ్ సెంటర్కు సంబంధించిన ఐడీ కార్డు జిరాక్స్, నిరుద్యోగ గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తీసుకొచ్చి బస్పాస్ లో రాయితీ పొందొచ్చు. మూడు నెలలకు ప్రస్తుతం ఆర్డినరీ బస్పాస్లకు రూ.3,450 ఉంది. దీన్ని 20శాతం తగ్గించి రూ.2,800 వసూలు చేస్తారు. మెట్రో ఎక్స్ప్రెస్ అయితే.. ప్రస్తుతం రూ.3,900 ఉంది. దీనికి 20శాతం రాయితీ ఇచ్చి రూ.3,200 వసూలు చేస్తామని ఆర్టీసీ వెల్లడించింది.