తెలంగాణ రాష్ట్రం పెట్టుబడుల సాధనలో మరో ముందడుగు వేసింది. ఇప్పటికే అనేక కంపెనీలు హైదరాబాద్, చుట్టుపక్కల సంస్థల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో మరో కీలక సంస్థ చేరింది. టైర్ల తయారీలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఎంఆర్ఎఫ్ కంపెనీ తెలంగాణలో మరో సంస్థను స్థాపించబోతున్నట్టు ప్రకటించింది. వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణలో విమానాల టైర్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్టు ఎంఆర్ఎఫ్ సంస్థ ప్రకటించింది. మంత్రి కేటీఆర్తో సమావేశం తర్వాత ఎంఆర్ఎఫ్ సంస్థ ప్రతినిధులు ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే సదాశివపేటలో ఎంఆర్ఎఫ్ సంస్థ టైర్ల ఫ్యాక్టరీ ఉంది. ఇప్పుడు విమానాల టైర్ల కంపెనీ కూడా తెలంగాణలోనే పెట్టాలని ఎంఆర్ఎఫ్ సంస్థ నిర్ణయించింది. ఈ కంపెనీ రాకతో వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. వరుస కంపెనీల రాకతో తెలంగాణలో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి.