అంతర్యుద్ధం కోసం జగన్ ప్రయత్నిస్తున్నారా?
టీడీపీ కార్యాలయాలు, నాయకులపై దాడులు చేయించడంద్వారా ముఖ్యమంత్రి జగన్ అంతర్యుద్ధం జరగాలని కోరుకుంటున్నట్లు కనపడుతోందని మాజీమంత్రి జవహర్ అన్నారు. ఈ విధంగా ఆయన తన రాక్షస మనస్తత్వాన్ని బయట పెట్టుకోవాలని చూస్తున్నారన్నారు. ఈరోజు రాష్ట్ర బంద్ జరగకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులను గృహనిర్బంధంలోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంతృత్వంలో ఉన్నామా? అనేది వారే చెప్పాలన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలను వేధించడం సరికాదని, ఇది పిరికపందలు చేసే పనులంటూ మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలుగుదేశం పార్టీని నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక మందు పోయించి కార్యకర్తలచేత దాడులు చేయించారని జవహర్ ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డిప్రెషనల్లోకి వెళ్లిందని, అందుకే తెదేపాపై దాడులు చేయిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో అందుకు తగ్గట్లుగా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.