కళా 'మా' తల్లి: జూబ్లీహిల్స్ పోలీసులకు ప్రకాష్రాజ్ ఫోన్?
మా అధ్యక్ష ఎన్నికలు ముగిసినా పోరు మాత్రం ఇంకా చల్లారలేదు. తాజాగా ప్రకాష్ రాజ్ ఎన్నికలు నిర్వహించిన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్కు వచ్చారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ పుటేజ్ కావాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫోన్ చేశారు. ఇరువర్గాల సమక్షంలో మాత్రమే సీసీటీవీ పుటేజ్ను సేకరిస్తామని, అంతేకాకుండా వాటిని ప్రిజర్వు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో మోహన్బాబు, నరేష్తోపాటు మరికొందరు తమ ప్యానెల్ సభ్యులపై దాడిచేశారని ప్రకాష్ రాజ్ చెబుతున్నారు. ఇవి కచ్చితంగా సీసీ టీవీ పుటేజ్లో ఉంటాయని, వాటిని ఇవ్వాలని కోరుతున్నారు. అయితే సీసీటీవీ పుటేజీ ఇవ్వడానికి ఎన్నికల అధికారి కృష్ణమోహన్ నిరాకరించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పుటేజీ ద్వారా కోర్టుకు వెళ్లే యోచనలో ప్రకాష్ రాజ్ ఉన్నారు. ఎన్నికలు ముగిసినప్పటికీ ప్రకాష్ రాజ్ వర్గం మాత్రం తమ పోరును కొనసాగిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోను ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే విషయాన్ని ప్రజలకు తెలియచెప్పడానికి తాము కంకణబద్దులై ఉన్నామని ఈ ప్యానెల్ చెబుతోంది.