ఓ కరోనా.. ఓ మోడీ.. ఓ భారత్..!!
ప్రజలకు కరోనా టీకా వేయడంలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం తొమ్మిది గంటల్లో రెండుకోట్ల డోసులు పంపిణీ చేసి చరిత్ర సృష్టించింది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని, మీ బంధువులకు, స్నేహితులకు కరోనా టీకా స్లాట్ బుక్ చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందరం టీకాలు వేయించుకోవడంద్వారా ప్రధానమంత్రికి నిజమైన జన్మదిన కానుకను ఇచ్చినవారిమవుతామన్నారు. సాయంత్రం ఐదుగంటల వరకు రెండుకోట్ల డోసుల పంపిణీ జరిగింది. రాత్రి వరకు మొత్తంగా 2.5 కోట్ల డోసుల పంపిణీ సాధ్యపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 79 కోట్ల డోసులు పంపిణీ జరిగినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. అక్టోబరు చివరునాటికి 100 కోట్ల డోసుల పంపిణీని లక్ష్యంగా నిర్ధేశించారు. ప్రజలంతా సహకరిస్తే కరోనా మహమ్మారిని టీకా రూపంలో తరిమికొట్టవచ్చని, అందరూ టీకా వేయించుకొని రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవాలని మాండవీయ కోరుతున్నారు.