వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు పై విమర్శల వర్షం కురింపించారు. వరుస ట్వీట్లతో విజయసాయి రెచ్చిపోయారు. బాబు జూమ్ మహానాడు ఊసుపోక అందరితో తిట్టించుకునేందుకు పెట్టినట్టే ఉందని విజయసాయి పేర్కొన్నారు. తాను చక్రం తిప్పినన్ని రోజులు పట్టించుకోకుండా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఇప్పుడు తీర్మానం చేయడం ఏంటని ప్రజలు నిలదీస్తున్నారని విజయసాయి అన్నారు. బిజెపితో కలిసి పనిచేయాలన్న ఆలోచనను కమలం పార్టీ నేతలు తూర్పార పట్టారని పేర్కొన్నారు. రంగు వెలిసిన పార్టీలో ఉత్తేజం నింపాలంటే కార్యకర్తలకు స్పూర్తిదాయకమైన కార్యాచరణను ఇవ్వాలని సంచలన కామెంట్లు చేశారు.
ప్రజలతో మమేకమై వారి అభిమానం చూరగొనాలని చెప్పాలని తెలిపారు. చంద్రబాబు మాత్రం ఏ కులాన్ని ఎలా మేనేజ్ చేయాలి. విద్వేషాలు రెచ్చగొట్టి సామరస్యాన్ని ఎలా దెబ్బతీయాలనే కాలం చెల్లిన వ్యూహాలకే పదును పెడుతున్నాడని ఆరోపించారు. అంతే కాకుండా విశాఖపట్నం జిల్లాలో కోవిడ్ పరిస్థితులపై ఈరోజు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నట్టు విజయసాయి వెల్లడించారు. మంత్రులు, జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, మేయర్ తో కలిసి సమావేశంలో పాల్గొన్నట్టు తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు ఇటీవల శంకుస్థాపన చేసిన విశాఖ అభివృద్ధి ప్రాజెక్టులపై సమీక్షసమావేశంలో చర్చించామని తెలిపారు.