రేపటి నుంచి లాక్డౌన్??
ఏపీలో రేపటి నుంచి అనధికారిక లాక్డౌన్ ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోజువారీ కేసులు ఒక్కసారిగా ఉధృతమవుతుండటంతోపాటు తిరుపతి ఉప ఎన్నిక కూడా ముగియడంతో లాక్ డౌన్పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది. అధికారవర్గాల నుంచి ఎటువంటి సమాచారం లేకపోయినప్పటికీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో మాత్రం వ్యాపార వర్గాలు లాక్డౌన్ స్వచ్ఛందంగా పాటించాలనే నిర్ణయాన్ని తీసుకున్నాయి. దీనిపై అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వమే ఏమీ మాట్లాడనప్పుడు మీరు అనవసరంగా ఎందుకు కలగజేసుకుంటున్నారు? మీకు షాపులుంటే మీరు మూసేసుకోండి అని వ్యాపారస్తులు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతనిధులపై మండిపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా సాయంత్రం ఆరు గంటలకు దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలన్నీ మూసేయాలని గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీర్మానించింది. కరోనా మొదటిదశలో లాక్డౌన్ వల్ల ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నుంచే ఇంతవరకు కోలుకోలేదని, ఎట్టిపరిస్థితుల్లోను ఛాంబర్ తీర్మానానికి మద్దతు పలికేది లేదని దుకాణదారులు స్పష్టం చేశారు.