దళితుణ్ని తొలగించారు... రెడ్డిపై చర్యలు లేవు?
నాగార్జున సాగర్ ఎన్నికలకు కొవిడ్ నిబంధనలు అడ్డు రావుకానీ అంబేద్కర్ జయంతి ఘనంగా చేయడానికి మాత్రం నిబంధనలు అడ్డు వస్తాయా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. దళితులను ముఖ్యమంత్రి చెయ్యాలని ఏ దళితుడూ అడగలేక పోతున్నారని, దళిత వ్యక్తిని తెలంగాణకు తొలి సీఎం చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా బుధవారం లోటస్ పాండ్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ చేవెళ్ల-ప్రాణహితకి దివంగత వైఎస్సార్ అంబేద్కర్ పేరు పెట్టారని, ఇప్పటి కాళేశ్వరం ప్రాజెక్ట్కు అంబేద్కర్ పేరు పెట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్యపై ఒక ఆరోపణ రాగానే వెంటనే ఆయన్ను తొలగించారని, ఎన్నో ఆరోపణలు వస్తున్న మల్లారెడ్డిపై మాత్రం చర్యలు తీసుకోవడానికి చేతులు రావడంలేదా? అని ప్రశ్నించారు.