మొయినాబాద్ మండలంలో మొదటిసారి కరోనా కలకలం!
తెలంగాణలో గత రెండు నెలల నుంచి కరోనా వైరస్ ప్రబలిపోతూ వస్తుంది. అయితే మరణాల సంఖ్య తక్కువగా ఉన్నా కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. గత 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1,00,000 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 54,04,512కి చేరింది. అలాగే మొత్తం మృతుల సంఖ్య 3,43,514గా ఉంది. అమెరికాలో అత్యధికంగా 24,54,452 కేసులు నమోదుకాగా, 1,43,739 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో సైతం రెండు వేల దిశగా కరోనా కేసులు పరుగులు పెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారీగా 71 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసులు 1991కి చేరాయి. మంగళవారం రాత్రి 8 గంటలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ రోజువారీ బులిటెన్ ను విడుదల చేసింది.
ఇవాళ అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 38 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు కొన్ని ప్రదేశాల్లో కేసులు నమోదు కాలేదు.. అలాంటిది మొదటి సారిగా మొయినాబాద్ మండలంలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. మొయినాబాద్కి చెందిన మహమ్మద్ హుస్సేన్ ముషీరాబాద్లో తన మామ ఇంటికి వెళ్లాడు. అతనికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో హాస్పటల్లో చికిత్స చేయించాడు. హాస్పిటల్లో చూపించిన అనంతరం మొహమ్మద్ హుస్సేన్ తిరిగి మొయినాబాద్ వచ్చాడు. ఈ నేపథ్యంలో పరీక్షలో హుస్సేన్ మామతో పాటు మరో ముగ్గురికి కరోనా ఉందని తేలింది. హుస్సేన్కు టెస్టులు చేయగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.