కరోనాకు టీకా.. భారత్ కీలక ముందడుగు!
కొవిడ్-19కు దేశీయంగానే టీకా రూపొందించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్), భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్(బీబీఐఎల్)లు సంయుక్తంగా ప్రాజెక్టు చేపడుతున్నాయి. ఈ సందర్భంగా ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. *నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ), పుణే పరిశోధనశాలలో వేరు చేయబడిన కరోనా వైరస్ను ఉపయోగించి ఈ వ్యాక్సిన్ తయారుచేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం. ఎన్ఐవీ నుంచి హైదరాబాద్లోని బీబీఐఎల్కు ఈ వైరస్ను తరలించాం. టీకా తయారీ, అభివృద్ధి, జంతువులు, మనుషులపై ప్రయోగాలు చేపట్టడం, విశ్లేషించడంలో బీబీఐఎల్–ఎన్ఐవీ పరస్పరం సహకరించుకుంటాయి’ అని ఐసీఎంఆర్ తెలిపింది.
ఇది చాలా మంచి పరిణామమని విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా వైరస్కు మందును కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే.. భారత్లోనే ఈ ప్రయత్నాలు ముందుగా సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయని, ఇక్కడి వాతావరణ పరిస్థితులు ప్రయోగాలకు దోహదం చేసేలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నిజానికి.. వైరస్ నిరంతరం రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో దేశీయంగా టీకాను తయారు చేసుకోవడమే మంచిదని అంటున్నారు.