కరోనా ఎఫెక్ట్: 600 సోషల్ మీడియా పోస్టులను తొలగించిన పోలీసులు
సోషల్ మీడియా అంటేనే.. ఎవరికితోసిన పోస్టులు వారు పెట్టేయడం.. ఇక కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నిజానిజాలతో నిమిత్తం లేకుండా ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారు. ఇక దీనిపై పోలీసులు ఎంత సీరియస్గా చెబుతున్నా.. వినిపించుకునే పరిస్థితి కనిపించడం లేదు.. కానీ.. ముంబై పోలీసులు మాత్రం మరింత సీరియస్ అయ్యారు. కరోనాకు సంబంధించిన 600 అభ్యంతరకరమైన పోస్టులు సోషల్ మీడియా నుంచి తీసిపారేశారు. అందులో ఫేక్ న్యూస్ ఐటెంలు, మతోన్మాదన్ని రెచ్చగొట్టే వీడియోలు, ఆడియోలు కూడా ఉన్నాయి. అలా తొలగించి వదిలేయకుండా ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 155 మంది నిందితులను అరెస్టు చేసినట్టు ముంబై పోలీసు సైబర్ విభాగం డీఐజీ హరీశ్ బైజాల్ తెలిపారు.
లాక్డౌన్ సందర్భంగా ముంబై పోలీసు నిఘా విభాగం సోషల్ మీడియా ల్యాబ్ ఆ పోస్టులను తొలగించింది. వాటిలో అత్యధికం తప్పుదోవ పట్టించేవి, నిరాధారమైనవి, ప్రజల్లో భయాందోళన సృష్టించేవి, మతపరమైన ఉద్రిక్తతలు కలిగించేవి ఉన్నాయని బైజాల్ చెప్పారు. ఫేక్ న్యూస్ ఏరివేత కోసం 30 మంది సాంకేతికంగా సుశిక్షితులైన బృందం రోజుకు 24 గంటలు, వారానికి 7 రోజులు పనిచేస్తుంటుందని తెలిపారు. ఫేస్బుక్, టిక్టాక్, ఇన్స్టాగ్రాం, యూట్యూబ్, టెలిగ్రాం వంటి అన్ని సామాజిక మాధ్యమాలను బృందం నిరంతరం పరిశీలిస్తుందని ఆయన పేర్కొన్నారు.