బిగ్ బ్రేకింగ్: భారత్లో ఆరువేలకు చేరువలో కరోనా కేసులు
భారత్లో కరోనా వైరస్ తన ప్రతాపం చూపుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది. బుధవారం రాత్రి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య ఆరువేలకు చేరువలో ఉంది. దేశ వ్యాప్తంగా 5916మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటివరకు 78మంది మరణించారు. ఈ గణాంకాలతో అటు ప్రభుత్వాల్లో, ఇటు ప్రజల్లో తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14వ తేదీ తర్వాత కూడా లాక్డౌన్ను కొనసాగించే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయంలో ఈనెల 11న ప్రధాని నరేంద్రమోడీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు లాక్డౌన్ పొడిగించాలని సూచించారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటివరకు సుమారు 15లక్షల మంది కరోనా వైరస్ బారినపడ్డారు. ఇక మృతుల సంఖ్య సుమారు 90వేలకు చేరువలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఇక అమెరికాలో మాత్రం పరిస్థితులు మరింత దయనీయంగా మారుతున్నాయి. సుమారు నాలుగున్నరలక్షలమందికిపైగా కరోనా బారినపడ్డారు. మృతుల సంఖ్య కూడా పదివేలకుపైగా ఉంది. ఒక్క న్యూయార్క్లోనే ఆరువేల మంది మరణించారు. జర్మనీ, ఫ్రాన్స్లో పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్క్ను దాటింది. యూకేలో ఒక్కరోజే ఏకంగా 938మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఏడువేలకుపైగా చేరింది. స్పెయిన్లో 24గంటల్లో 757మంది మృతి చెందారు. అలాగే మరికొన్ని దేశాల్లో కూడా కరోనా వైరస్ కలకలం రేపుతోంది.